ఫీడింగ్‌ ఖర్చు తగ్గించుకునేందుకు.. | - | Sakshi
Sakshi News home page

ఫీడింగ్‌ ఖర్చు తగ్గించుకునేందుకు..

Jun 18 2025 7:20 AM | Updated on Jun 18 2025 7:20 AM

ఫీడిం

ఫీడింగ్‌ ఖర్చు తగ్గించుకునేందుకు..

ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

చికెన్‌ వ్యర్థాల్లో పలు రకాల సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలు, శిలీంద్రాలు, వైరస్‌లు ఉంటాయి. తగిన విధంగా ప్రాసెస్‌ చేయకుండా, చేపలకు నేరుగా ఆహారంగా వేయడం వల్ల ఈ–కొలీ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. దీని వల్ల చేపలతోపాటు మనుషులకు ప్రమాదకరమైన జబ్బులు కలిగిస్తాయి. చేపలను శుభ్రపరిచేటప్పుడు వాటిని తాకిన మనుషులకు అలెర్జీలు, టైఫాయిడ్‌ జబ్బులు రావొచ్చు. వ్యర్థాల్లో ఉండే అమ్మోనియా నీటిలో కలుషి తం కావడం వల్ల ఆర్సెనిక్‌, లెడ్‌ వంటి విష పూరితమైన మూలకాలు నీటిలో కలిసే ప్రమాదం ఉంది. జ్ఞాపక శక్తి తగ్గిపోవడంతోపాటు, నరాల బలహీనతలు వచ్చే ప్రమాదం ఉంది.

– డాక్టర్‌ ఎంవీ రమణయ్య,

సీనియర్‌ వైద్యుడు, పీపీసీ

చేపలు.. అదీ నెల్లూరు చేపల పులుసు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఫేమస్‌. వీటిల్లోని ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు నెల్లూరు చేపలు తింటే గుండె, కిడ్నీ, జీర్ణాశయం జబ్బులతోపాటు ప్రధానంగా కేన్సర్‌ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. చేపల పెంపకందారులు వీటికి కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను ఆహారంగా వేస్తుండడమే కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

నీరు, ఆహారం కలుషితం

చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా గుంతల్లో వేసినప్పుడు నీరు కలుషితమవుతోంది. పాత నీటిని వదిలి కొత్త నీటిని గుంతల్లోకి వదిలే క్రమంలో ఒక చోట నుంచి మరో చోటుకు కలుషితమైన నీరు చేరడం ద్వారా మానవులకు చర్మ సంబంధిత రోగాలు వస్తాయి. ఇలాంటి చేపలను తినడం ద్వారా మనుషులకు సులభతరంగా జబ్బులు అంటుకుంటున్నాయి. చేపల్లో చేరిన సీసం ద్వారా మనుషుల్లో నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఉదర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల చికెన్‌ వ్యర్థాలను చేపల గుంతల్లో వేయడం మంచిది కాదు.

– డాక్టర్‌ వై.గంగాధర్‌, ఎండీ,

ఫిజీషియన్‌, లీడ్‌ హాస్పిటల్‌, నెల్లూరు

జీర్ణాశయం, గుండె, కిడ్నీ వ్యాధులు వస్తాయని వైద్యుల హెచ్చరిక

కేన్సర్‌ కూడా రావొచ్చని చెబుతున్న డాక్టర్లు

వీటికి చికెన్‌ వేస్టే ఫీడింగ్‌

కోవూరు, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా వినియోగం

నిత్యం పట్టుబడుతున్న చికెన్‌ వ్యర్థాల వాహనాలు

కట్టడి చేయలేకపోతున్న

అధికార యంత్రాంగం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నాన్‌వెజ్‌ ఫుడ్‌లో ఆరోగ్యానికి చేపలు మంచివని వైద్యులు సూచిస్తుంటారు. సంప్రదాయంగా చెరువులు, వాగులు, జలాశయాల్లో పెరిగే చేపలు ఆరోగ్యానికి మేలు చేస్తుండగా, జిల్లాలో వేలాది ఎకరాల్లో కృత్రిమంగా పెంచుతున్న చేపలు తింటే మాత్రం చేటు తప్పదని అదే వైద్యులు హెచ్చరిస్తున్నారు. గతంలో అరకొర మంది చేపల ఉత్పత్తిదారులు ఇలాంటి చికెన్‌ వ్యర్థాలను చాటుమాటున వినియోగిస్తుంటే.. కూటమి ప్రభు త్వం వచ్చాక విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. కోవూరు షాడో ఎమ్మెల్యే నేతృత్వంలో ‘చికెన్‌ వేస్ట్‌ మాఫియా’ ఏర్పాటైంది. కోవూరు నియోజకవర్గంలో అన్ని మండలాలతోపాటు, ఆత్మకూరు, సర్వేపల్లి మండలాల్లో కొన్ని గ్రామాల్లో చేపల పెంపకం జరుగుతోంది. ఈ మాఫియా కనుసన్నల్లోనే అన్ని ప్రాంతాలకు కుళ్లిన చికెన్‌ వ్యర్థాలను తెచ్చి వినియోగిస్తున్నారు. నెలకు రూ.కోట్లల్లో ఈ వ్యాపారం జరుగుతుంటే ఏ స్థాయిలో వినియోగం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి తమ జేబులు నిండితే చాలన్నట్లుగా టీడీపీ నేతలు కాసులు పిండుకుంటున్నారు. పోలీసులు, మత్స్యకార అధికారుల సహకారంతో ఇదంతా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇతర రాష్ట్రాల్లో డంపింగ్‌ యార్డులు

పర్యావరణాన్ని కాపాడే చర్యల్లో భాగంగా చేపలు, రొయ్యలకు మేతగా కుళ్లిన మాంసాన్ని వేయడాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిన నేపథ్యంలో రెండేళ్ల క్రితం ప్రత్యేక జీఓ కూడా తెచ్చింది. దీంతో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు చికెన్‌ వేస్ట్‌ను నిర్వీర్యం చేస్తూ చర్యలు చేపట్టడంతో ఇది జిల్లాలో కూటమి నేతలకు వరంగా మారింది. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు కొందరు మాఫియాగా తయారయ్యారు. ఇందు కోసం బెంగళూరు, చైన్నె, కేరళ ప్రాంతంలో కోళ్ల వ్యర్థాల సేకరణకు ప్రత్యకంగా డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల్లో చికెన్‌ నుంచి వ్యర్థాల సేకరణ చేస్తున్నారు. కేజీ రూ.5 వంతున సేకరించి డంపింగ్‌ యార్డుల్లోకి చేర్చుకుని అక్కడి నుంచి రాత్రి వేళల్లో లోడింగ్‌ చేసి నెల్లూరుకు రవాణా చేస్తున్నారు.

నెలకు రూ.లక్షల్లో మామూళ్లు

ఈ వాహనాలు రాష్ట్రాల చెక్‌పోస్టులు, జిల్లాలోని టోల్‌గేట్లు దాటుకుని వస్తున్నప్పుడు వాటిని కట్టడి చేసే అవకాశం ఇటు పోలీసులకు, అటు మత్స్యశాఖ అధికారులు పెద్ద కష్టమేమి కాదు. వీటిని గుర్తించి కట్టడి చేసే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పోలీస్‌ శాఖకు ఒక్కో వాహనానికి రూ.10 వేలు వంతున నెలవారీ మామూళ్లు ముట్టజెప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే నెలకు వంద వాహనాలు తిరిగితే నెలకు ఒక్కో స్టేషన్‌కు రూ.10 లక్షలు ఇస్తారు. సర్కిల్‌, డీఎస్పీ స్థాయి అధికారులతోపాటు మత్స్యశాఖ అధికారులకు ప్రత్యేకంగా మామూళ్లు ఇస్తారనే ఆరోపణలున్నాయి. బెంగళూరు నుంచి కడప సరిహద్దు ప్రాంతం నుంచి వాహనాలు వస్తాయి. చైన్నె, కేరళ నుంచి జాతీయ రహదారి నుంచే వాహనాలు వస్తాయి. ఆయా ప్రాంతాల్లో ప్రతి స్టేషన్‌కు, సర్కిల్‌కు నెలవారీ మామూళ్లు ఇస్తుండడంతో ఏ అధికారి ఆ వాహనాల జోలికి వెళ్లడం లేదు. అడపాదడపా రోడ్డు ప్రమాదాలు, వాహనం పాడైతే మాత్రం వ్యర్థాల రవాణా వెలుగులోకి వస్తున్నాయి

చేతులెత్తేసిన ఎమ్మెల్యే

కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చికెన్‌ వ్యర్థాల మాఫియా బరితెగించింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చికెన్‌ వ్యర్థాల విషయంపై పోలీస్‌ శాఖకు ఆదేశాలిచ్చారు. నాలుగు నెలల తర్వాత కట్టడి చేస్తామని, క్రాప్‌ మధ్యలో ఉందని చెప్పారు. కానీ ఎక్కడా ఎమ్మెల్యే ఆదేశాలు అమలు చేయడం లేదు. అడపాదడపా పోలీసులు వాహనాల పట్టివేత చూపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆత్మకూరు మండంలోని వాసిలి ప్రాంతంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన కార్యకర్తలు చికెన్‌ వ్యర్థాల డంపింగ్‌ కేంద్రాన్ని చూపించి పోలీసులకు పట్టించారు. ఇంత జరుగుతున్నా.. పాలకులకు తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది.

జిల్లాలో ప్రధానంగా కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, విడవలూరు, ఆత్మకూరు రూరల్‌, సంగం, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలాల్లో వేల ఎకరాల్లో చేపల పెంపకం జరుగుతోంది. అయితే చేపలకు వినియోగించే ఫీడ్‌ (ఆహారం) ఖరీదు కావడంతో వీటి పోషణ రైతులకు భారంగా మారింది. సాధారణంగా చేపలు ఒక కేజీ పైబడి పెరగడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతోంది. రైతుల దగ్గర వ్యాపారులు చేపలను కేజీ రూ.80 నుంచి రూ.90లకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి. అదే కోళ్ల మేతగా బ్రాండెడ్‌ ఫీడ్‌కు బదులు, ప్రత్యామ్నాయంగా అతి తక్కువ ఖర్చుతో కూడిన కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగించడంతో నాలుగు నెలలకే కేజీ, అంతకు మించిన బరువు పెరుగుతున్నాయి. దీంతో జిల్లాలో దాదాపు 80 శాతం మంది చేపల రైతులు కోళ్ల వ్యర్థాలనే వినియోగిస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాల నుంచి కోళ్ల వ్యర్థాలు జిల్లాకు తెచ్చి విక్రయించే మాఫియా తయారైంది. అక్కడ కేజీకి ఐదారు రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ రూ.15లకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా నెలకు సుమారుగా రూ.10 కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం.

ఫీడింగ్‌ ఖర్చు తగ్గించుకునేందుకు.. 
1
1/3

ఫీడింగ్‌ ఖర్చు తగ్గించుకునేందుకు..

ఫీడింగ్‌ ఖర్చు తగ్గించుకునేందుకు.. 
2
2/3

ఫీడింగ్‌ ఖర్చు తగ్గించుకునేందుకు..

ఫీడింగ్‌ ఖర్చు తగ్గించుకునేందుకు.. 
3
3/3

ఫీడింగ్‌ ఖర్చు తగ్గించుకునేందుకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement