
కూటమి పాలనలో ‘చేనేత’ నిర్వీర్యం
నెల్లూరు (స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం చేనేత వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర మండి పడ్డారు. చీరాల నుంచి చేనేత సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన బుధవారం నెల్లూరుకు వచ్చారు. మినీ బైపాస్లోని ఆ సంస్థ కార్యాలయంలో చేనేత సంఘ నాయకులతో కలిసి సమస్యలు వాటి పరిష్కారాలపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు, పాలక మండళ్లను నియమించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ‘నేతన్న నేస్తం’ ద్వారా మగ్గం ఉన్న వారికి ఏడాదికి రూ.24 వేలు ఇచ్చి ఆదుకున్నారని, ఆ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలన్నారు. ఆప్కో చైర్మన్ను నామినేట్ చేసే జీఓను ఇంత వరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. చేనేత వర్గంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. ఎన్నికల్లో జీఎస్టీపై హామీ ఇచ్చిన లోకేశ్ ఇప్పటి వరకు దాని గురించి చర్చించకపోవడం విచారకరమన్నారు. ఆకలి చావులు లేకుండా చూడాల్సిన ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కొంగ జపం చేస్తుందని, పేదల సంక్షేమం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో చేనేత సొసైటీ మాజీ ఇన్చార్జి శీతా సుధాకర్, మాస్టర్ వీవర్ కడవల వెంకటశేషయ్య, చేనేత నాయకులు మదిర దయాకర్ పాల్గొన్నారు.
పేదల సంక్షేమంపై నిర్లక్ష్యం తగదు
వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏటా
రూ.24 వేల సాయం
దేవాంగ కార్పొరేషన్
మాజీ చైర్మన్ బీరక సురేంద్ర