
మాకూ ‘తల్లికి వందనం’ అమలు చేయాలి
● కార్పొరేషన్ కార్యాలయం
ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా
నెల్లూరు (బృందావనం): తమకు తల్లికి వందనంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వైఓ నందన్కు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.పెంచలనరసయ్య, సీఐటీయూ రూరల్ అధ్యక్షుడు కొండాప్రసాద్ మాట్లాడుతూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పారిశుధ్య కార్మికులందరికి తల్లికి వందనం అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేసిన ఇప్పటికీ దరఖాస్తులు తీసుకోవడం లేదన్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని, వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎవరూ చేయని విధంగా మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేస్తున్నారన్నారు. వీరందరూ దళితులు, గిరిజనులన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. నిరసనలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుజాతమ్మ, వజ్రమ్మ, లక్ష్మీ, చెన్నయ్య, బుజ్జమ్మ, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.