
సీఎం ఇలాకాలోనే మహిళకు రక్షణ ఏదీ?
నెల్లూరు(స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోనే సామాన్య మహిళలకు రక్షణ లేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు భద్రత, రక్షణ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుందన్నారు. తాజాగా కుప్పంలో శిరీషా అనే మహిళకు జరిగిన ఘోర అవమానానికి కూటమి ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటనలు జరిగాయంటే టీడీపీ నేతలు ఎవరి అండ చూసుకుని ఇలా దారుణంగా వ్యవహరించారని ప్రశ్నించారు. బాధితురాలు శిరీషా భర్త తిమ్మరాయప్ప ఓ వ్యక్తి దగ్గర రూ.80 వేలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించే క్రమంలో ఆలస్యమవడంతో ఇటువంటి దారుణానికి పాల్పడడం అనాగరిక చర్య అన్నారు. అప్పు ఇచ్చిన మునికన్నప్ప టీడీపీ నాయకుడు కావడంతో అతనిపై తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నారన్నారు. టీడీపీ నాయకులు అయితే ఏం చేసినా ఎటువంటి దాడులకు పాల్పడినా చెల్లుబాటు అవుతుందని సీఎం ఈ ఘటనతో స్పష్టం చేశారన్నారు. హోంమంత్రి అనిత తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి భారతి, పార్టీ నాయకులు రోజా, ఇతర నాయకులను తిట్టడంతోపాటు అక్రమ కేసులు పెట్టి వారిని వేధించడంపై చూపే శ్రద్ధ కొంచమైనా మహిళలు, బాలికలను రక్షించడంలో చూపాలన్నారు. ఎన్నికల ముందు పవన్కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును అడ్డుపెట్టుకుని మహిళల మీద అన్యాయం జరుగుతుందని ఊగిపోయారని, ఇప్పుడు మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 188 మంది మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరిగితే పవన్కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ కనీసం స్పందించకపోవడం బాధాకరమన్నారు. సుమారు 15 మంది మహిళలను హత్య చేస్తే పట్టించుకోవడం మానేసిన ప్రభుత్వం మద్య పానాన్ని, గంజాయిని రాష్ట్రమంతా విస్తరించే పనిలో ఉందన్నారు. ఇకనైనా చంద్రబాబు కళ్లు తెరిచి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలను, హత్యలను అరికట్టి మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. బాధిత మహిళలకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం తోడుగా నిలుస్తుందన్నారు. వారి కోసం పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు
దారుణంగా క్షీణించాయి
మహిళలు, ఆడపిల్లలకు
భద్రత కరువు
వైఎస్సార్సీపీ జిల్లా మహిళా
అధ్యక్షురాలు లక్ష్మీ సునంద