
ఏఎన్ఎం బదిలీల్లో సిఫార్సు లేఖలు
● అర్హులకు అన్యాయం
నెల్లూరు (అర్బన్): జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో జరుగుతున్న సాధారణ బదిలీల్లో సిఫార్సులతో అర్హులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఏపీఎన్జీఓ, ఏపీ జీఈఏ వంటి యూనియన్ల ఆఫీసు బేరర్లకు ప్రాధాన్యత ఉంది. ఈ అవకాశాన్ని అడ్డు పెట్టుకుని ఆఫీసు బేరర్ల కాని వారికి కూడా యూనియన్ల నేతలు రూ.10 వేల నుంచి రూ.20 వేలు వరకు డబ్బులు వసూలు చేసి సిఫార్సు లేఖలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో సీనియర్లకు తీవ్ర నష్టం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. యూనియన్ల నాయకులు ఇష్టారాజ్యంగా లేఖలు ఇవ్వడంతోనే సీనియారిటీ ఉన్న వారికి దూరంగా.. జూనియర్లకు దగ్గరగా వచ్చారని తెలుస్తోంది. మరో వైపు సీనియారిటీ జాబితా తయారీలోనూ లొసుగులున్నాయనే ఆరోపణలున్నాయి. బుధవారం జరిగిన ఏఎన్ఎం బదిలీల్లో సబ్ సెంటర్లలో పనిచేసే వారి సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలి. అయితే కొన్నిచోట్ల తప్పులు దొర్లాయి. ఒక చోట పీహెచ్సీని ప్రాతిపదికగా తీసుకుని అక్కడి యూడీసీ సీనియారిటీ జాబితాను వైద్యశాఖకు పంపించారు. అందులో ఒక ఏఎన్ఎం పేరు 13వ స్థానానికి వచ్చింది. ఈ లోపాన్ని గుర్తించిన వైద్యశాఖాధికారులు మళ్లీ సబ్సెంటర్ ప్రాతిపదికగా మరో జాబితాను తయారు చేశారు. దీంతో ఆ ఏఎన్ఎం 13వ స్థానం నుంచి ఏకంగా 108 స్థానానికి వెళ్లిపోయారు. ఇదెలా సాధ్యమని ఆ ఏఎన్ఎం ప్రశ్నిస్తున్నారు. అనుమానాలు, అధికారుల వివరణలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కౌన్సెలింగ్ జరిపి బదిలీలు చేశారు. 135 ఏఎన్ఎంలు, 5 మంది రిక్వెస్ట్ డాక్టర్లకు బుధవారం కౌన్సెలింగ్ జరిగింది.