
నిబంధనలతో కొర్రీలు
వైఎస్సార్సీపీ పాలనలో ఇచ్చిన రైతు భరోసా
సంవత్సరం మొత్తం రైతులు ఆర్థిక సాయం
(రూ.కోట్లల్లో)
2019–20 2,02,306 273.11
2020–21 2,43,502 328.72
2021–22 2,43,911 329.27
2022–23 2,14,667 289.80
2023–24 2,14,667 289.80
● అన్నదాత పథకానికి కోత
● 3.19 లక్షల మంది రైతుల దరఖాస్తు
● 1.77 లక్షల మందిని అర్హులుగా
గుర్తించిన ప్రభుత్వం
● కౌలు రైతులకు పంగనామాలు
● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,14,667 మందికి రైతు భరోసా
● రేపు పీఎంకిసాన్ సాయంతో కలిపి వేస్తామని చంద్రబాబు హామీ
● పథకం అమలుపై ఇప్పటికీ స్పష్టత లేదంటున్న వ్యవసాయశాఖాధికారులు
నెల్లూరు (పొగతోట) : కూటమి అధికారంలోకి వచ్చి అన్నదాతల ఆశలను చిదిమేసింది. ఆరుగాలం పండించిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సాగు పెట్టుబడిగా అన్నదాత సుఖీభవ పథకంతో ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటూ ప్రచారం చేసి తొలి ఏడాదిలోనే హామీని తుంగలో తొక్కేశారు. తాజాగా పీఎంకిసాన్ మొత్తాన్ని మినహాయించి రూ.14 వేలు మూడు విడతల్లో ఇస్తామని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. అయితే ఏ విడతలో ఎంత ఇస్తారు.. అసలు పీఎంకిసాన్ నిధులు విడుదల చేసిన రోజే ఇస్తారా? లేదా? అనే విషయంలో వ్యవసాయశాఖాధికారులకే నేటికీ స్పష్టత లేదని తెలుస్తోంది.
వైఎస్సార్ రైతు భరోసా పథకం.. జగన్ బ్రాండ్
చంద్రబాబు గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ ఏనాడు అన్నదాతల కోసం ఎలాంటి పథకాన్ని అమలు చేయలేదు. ఆర్థికంగా ఆదుకున్నది లేదు. అధికారంలోకి వచ్చిన ప్రతి సారి రైతులను వంచనకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుకు మాత్రమే ఉంది. 2004 ముందు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారు. వ్యవసాయమే దండగ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, 2014 ఎన్నికల్లో రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని నిలువునా మోసం చేశారు. తాజా ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరును అన్నదాత సుఖీభవ పథకంగా మార్పు చేసి ఆర్థిక సాయం అందిస్తామని చెబుతున్నారు.
కౌలు రైతులు అవుట్
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2025–26 ఆర్థిక సంవత్సరానికి 3.19 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వివిధ రకాల కారణాలు చూపి వారిలో 1.77 లక్షల మందిని మాత్రమే అర్హులని తేల్చి చెప్పారు. ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ ఇస్తామని హామీలిచ్చినా.. చివరికి గత ప్రభుత్వంలోని అర్హుల్లో సుమారు 50 వేల మందిని తొలగించారు. కౌలు రైతులు అయితే ఈ పథకానికే అర్హులే కాదంటూ విస్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చివరి సంవత్సరంలోనూ 2,14,667 లక్షల మందికి వైఎస్సార్ రైతు భరోసా పథకం సాయం అందించింది. చంద్రబాబు చరిత్ర చూస్తే.. గతంలో రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ అని ప్రచారం చేసి, అధికారంలోకి రాగానే ఒక కమిటీ వేసి నిబంధనలు పెట్టి కొర్రీలు వేసి లక్షల మంది రైతులను తొలగించారు. బ్యాంకుల్లో పెట్టి బంగారాన్ని తిరిగి ఇస్తానని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనలు పెట్టి బంగారాన్ని వేలం వేసి దగా చేశారు. రుణం మొత్తాన్ని ఐదు విడతల్లో ఇస్తామని ఒకటి.. రెండు విడతలు ఇచ్చి మిగతావి ఎగనామం పెట్టారు.
అన్నదాత సుఖీభవ
జాబితా
అంతన్నాడు.. ఇంతన్నాడు.. ఆఖరికి కొందరికే అన్నదాత సుఖీభవ అంటున్నాడు. వ్యవసాయం దండగ అని విమర్శించిన చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడానికి గతంలో రైతులకు రుణమాఫీ అంటూ మోసం చేశారు. చంద్రబాబు చరిత్రలో రైతుల కోసం ఎలాంటి పథకాన్ని అమలు చేయలేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ అధికారం చేజిక్కించుకునేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవగా పేరు మార్చి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీలు గుప్పించారు. అధికారం దక్కగానే గతేడాది ఎగనామం పెట్టిన చంద్రబాబు ఈ ఏడాది వచ్చే సరికి నాలిక మడతేసి, పీఎం కిసాన్ మొత్తాన్ని మినహాయించి రూ.14 వేలు ఇస్తామంటూ ఆఖరి రాగం పాడేశారు. గత ప్రభుత్వంలోని లబ్ధిదారుల్లో నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి వేలాది మందిని తొలగించేశారు. కౌలు రైతులను ఆదుకుంటానని.. జాబితా నుంచే లేపేశారు.
ఈకేవైసీ, ఆధార్లింక్, బ్యాంకు అకౌంట్ లింకు కాలేదంటూ తదితర కారణాలు చూపి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో రైతులను అనర్హులుగా ప్రకటించారు. ఆర్టీజీఎస్ వ్యాలిడేషన్ తర్వాత అర్హులైన రైతులు 1.77 లక్షల మందేనని జిల్లా వ్యవసాయ అధికారులు లెక్కలు తేల్చారు. రైతులు రైతుభరోసా కేంద్రాలకు వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంది. ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. వీటిపై అవగాహన లేక వేలాది మంది రైతులు వేలిముద్ర వేయలేదు. వారికి అవగాహన కల్పించడంలో సర్కారు పూర్తిగా విఫలమైంది. సర్కారు నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది రైతులు అన్నదాత సుఖీభవకు దూరమయ్యారు. జిల్లాలో అన్నదాత సుఖీభవ మార్గదర్శకాల ప్రకారం రైతు కుటుంబానికి ఒక్కరికి మాత్రమే సంవత్సరానికి రూ.20 వేలు మూడు దఫాలుగా పీఎం కిసాన్తో కలిపి అందించనున్నారు. ప్రకటించిన సాయం ఎప్పుడొస్తుందో తెలియక దయనీయ స్థితిలో రైతులు ఉన్నారు. ప్రస్తుతం ఈకేవైసీ, థంబ్ వేసేందుకు రైతులకు మరో పర్యాయం అవకాశం ఇస్తామని వ్యవసాయ శాఖాధికారులు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థిఽతి చూస్తుంటే ప్రభుత్వం మరొక పర్యాయం ఈకేవైసీ థంబ్ వేసేందుకు అవకాశం కల్పించే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నాయి.