
గంగిశెట్టికి బాలసాహిత్య అవార్డు
ఆనందం మాటల్లో చెప్పలేను
ఊహ తెలిసిన నాటి నుంచి చందమామ, బాలమిత్ర కథలు చదివాను. తాను కథలు చదివిన చందమామలో కథలు రాశాను. ఆ పత్రికలో ఉపసంపాదకుడిగా పనిచేశాను. ఆ బాలకథల ద్వారానే బాలసాహిత్యంలో కేంద్రసాహితీ పురస్కారాన్ని అందుకోవడంతో ఈ ఆనందం మాటల్లో చెప్పలే ను. ఈ పురస్కారాన్ని తనను బాల్యంలో ప్రోత్సహించిన తల్లిదండ్రులు చిరంజీవి,అంజనాదేవి, విద్యాబుద్దులు నేర్పిన గురువులతోపాటు దిశానిర్దేశనం చేసి ప్రొఫెసర్ గూడూరు నాగయ్యకుకు అంకితంచేస్తున్నాను. ఈ పురస్కారం కింద నగదుతోపాటు అకాడమీ అవార్డును ఢిల్లీలో రాష్ట్రపతి ద్వారా అందుకోనుండడం సంతోషకరం.
– డాక్టర్ గంగిశెట్టి శివకుమార్
నెల్లూరు(బృందావనం): సాహితీ రంగంలో ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ఈ ఏడాది నెల్లూరీయుడైన డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ను వరించింది. దాదాపు 57 ఏళ్లుగా ఆయన పడిన సాహితీ సేద్య శ్రమకు ఫలితం దక్కింది. నెల్లూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షుడు గంగిశెట్టి శివకుమార్ ‘కబుర్ల దేవత’ కథలు పుస్తకానికి బాలసాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని కేంద్రం బుధవారం ప్రకటించింది.
13వ ఏటే సాహితీ ప్రస్థానం
గంగిశెట్టి శివకుమార్ రాపూరులో 1954లో జన్మించారు. జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైరయ్యారు. తన 13వ ఏట సాహితీ ప్రస్థానం ఆరంభించిన గంగిశెట్టి బాలల కథలు రాస్తూనే ఉన్నారు. చందమామ, బాలమిత్ర వంటి పిల్లల పత్రికల్లో తెలుగు, ఆంగ్లంలో చంపక్, గోకులం పత్రికల్లో బాలకథలు రాశారు. అమెరికాలోని బాలల కోసం ‘మూన్బీమ్’ (చంద్రకిరణాలు) ఆంగ్ల కథలు రాశారు. తెలుగులో బాలకథలపై పరిశోధన చేసి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ‘డాక్టరేట్’ అందుకొన్నారు. చందమామ పత్రికలో సబ్ ఎడిటర్గా ఉద్యోగం చేశారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు బాలసాహిత్యానికి సంబంధించి 40 వరకు పరిశోధన పత్రాలు సమర్పణ, బాలబంధు, బాలసాహితీ సామ్రాట్ బిరుదులు పొందారు.
ఘన సన్మానం
ఈ నేపథ్యంలో స్థానిక రిత్విక్ఎన్క్లేవ్లోని శ్రీవేంకటేశ్వర విద్యాలయంలో అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అంతర్జాతీయ కవి డాక్టర్ పెరుగు రామకృష్ణ, ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టేకుమళ్ల వెంకటప్పయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరుణశ్రీ, కార్యదర్శి అవ్వారు శ్రీధర్బాబు తదితరులు ఘనంగా సన్మానించి అభినందించారు.