
చికెన్ వ్యర్థాల వాహనం పట్టివేత
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని పంచేడు గ్రామంలో చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సోమవారం అర్ధరాత్రి గ్రామం మీదుగా చికెన్ వ్యర్థాలతో వాహనం వెళ్తుండగా స్థానికులు దుర్గంధం భరించలేక అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. రాత్రి వేళల్లో చికెన్ వ్యర్థాల వాహనాలు పదుల సంఖ్యలో తమ గ్రామం మీదుగా వెళ్తున్నాయని, పోలీసులు నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.
నూతన రహదారితో
ప్రజలకు ఉపయోగం
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి నుంచి మర్రిపాడు మండలం డీసీపల్లి మీదుగా వెన్నవాడ, గండ్లవేడులను తాకుతూ వింజమూరు మండలం నల్లగొండ్ల వరకు పీఎంజీఎస్వై పథకంలో నిర్మిస్తున్న రహదారి మూడు మండలాలకు ప్రయోజనకరంగా ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ అశోక్ పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనులను తన శాఖ అధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గండ్లవేడు – నల్లగొండ్ల మధ్య నిర్మించిన తారు, సిమెంట్ రోడ్లతోపాటు వెన్నవాడ బొగ్గేరు వద్ద నూతనంగా నిర్మించిన కాజ్వే పనులను ఆయన క్షేత్ర పరిశీలన చేశారు. అనంతరం డీసీపల్లి – రామస్వామిపల్లి మధ్యలో నిర్మించిన సిమెంట్ రోడ్లు, తారురోడ్లను పరిశీలించి పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం, పదిరోజుల్లో ఈ రహదారుల నిర్మాణాలను పూర్తి చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే వెన్నవాడ వద్ద సుమారు 250 మీటర్ల మేరకు స్థానికులు రహదారి నిర్మాణానికి ఇబ్బందులు కల్పిస్తున్న కారణంగా ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ప్రాజెక్ట్ విభాగం డీఈ సుధాకర్రెడ్డి, ఏఈ ప్రసాద్, గండ్లవేడు స్థానిక నాయకుడు కొల్లి దొరస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
సాగునీరు విడుదల
సైదాపురం: కండలేరు 2ఏ, 2బీ బ్రాంచ్ కెనాళ్లకు సాగునీరు విడుదల చేశారు. ఈ ఏడాది ఎడగారు పంటలకు సైదాపురం మండలానికి వచ్చే ప్రధాన కాలువలైన 2ఏ, 2బీ కెనాళ్లకు నీటిని విడుదల చేశారు. దీంతో మండలంలోని తుమ్మల తలుపూరు, కలిచేడు, ఓరుపల్లి, మలిచేడు, కట్టబడిపల్లి, దేవరవేమూరు, తురిమెర్ల, ఊటుకూరు, గిద్దలూరు, జోగిపల్లి, పోక్కందల, ఆదూరుపల్లి, మొలకలపూండ్ల, సైదాపురం, రామసాగరం, పెరుమాళ్లపాడు, పరసారెడ్డిపల్లి చెరువులకు 2ఏ బ్రాంచి కెనాల్ ద్వారా సాగు నీరు వస్తోంది. సుమారు 16వేల మాగాణి భూములకు సాగునీరు అందనుండటంతో రైతులు పంటల సాగు చేపట్టనున్నారు. అలాగే 2బీ కాలువ ద్వారా చీకవోలు, అన్నంరాజుపల్లి, రాజులెరుగుంటపాళెం, పోతేగుంట, చాగణం, రాగనరామాపురం, తిప్పిరెడ్డిపల్లి, లింగసముద్రం, కమ్మవారిపల్లి, గంగదేవిపల్లి, అనంతమడుగు, పాలూరు, తోకలపూడి, వేములచేడు గ్రామాల్లో సుమారు 14,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

చికెన్ వ్యర్థాల వాహనం పట్టివేత