
నిషాలో నేరాలు
కొందరు రాత్రి సమయంలో మద్యం తాగి ఉంటారు. దారిలో వెళ్లే వారిని అడ్డగించి బెదిరించి నగదు దోచుకుంటారు. ఒకప్పుడు ఇలాంటివి ఎక్కడో జరిగితే వినేవాళ్లం. నేడు నిత్యకృత్యమయ్యాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
నెల్లూరు(క్రైమ్): కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. మద్యం, గంజాయి విచ్చలవిడి విక్రయాలతోపాటుగా ఇతర మత్తు ఉత్ప్రేరకాలు అందుబాటులో ఉంటుండటంతో నిషా మత్తులో నేరాలు అధికమయ్యాయి. ప్రశాంత సింహపురి నేరపురిగా మారుతోంది. పాతనేరస్తులు, వ్యసనాలకు బానిసైన కొందరు తమ అవసరాలకు సరిపడా నగదు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కత్తులు, మారణాయుధాలను చేతబూని రాత్రివేళల్లో ఒంటరిగా వెళ్లేవారిని చంపుతామని బెదిరించి, దౌర్జన్యం చేసి నగదు, సెల్ఫోన్లు దోచుకెళుతున్నారు. ఎదురు తిరిగిన వారిపై దాడులకు వెనుకాడటం లేదు. ఇంకొందరు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ప్రజలపై దాడులు చేస్తున్నారు. నెల్లూరు నగరంలో ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని లేకుండా అన్నిచోట్లా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. బాధితుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండగా మరికొందరు భయంతో పోలీస్స్టేషన్ వరకు వెళ్లడం లేదు. ఇదే అదునుగా భావించిన కొందరు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు.
భయంతో..
ఏ వేళలో అయినా ప్రజలు నిర్భయంగా నగరంలో రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనుమరుగవుతోంది. ఇంటి నుంచి బయటకు వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరు దాడి చేస్తారోనన్న భయంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. నేర నియంత్రణకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ పాతనేరస్తులు, ఆకతాయిల భరతం పడుతున్నా పరిస్థితుల్లో మాత్రం మార్పురావడం లేదు. ఇప్పటికై నా పోలీసు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలి. మత్తులోనే నేరాలు అధికంగా జరుగుతుండటంతో మద్యం అనధికార విక్రయాలు, గంజాయి విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక శక్తులు, పాతనేరస్తుల కదలికలపై నిఘా పెంచి వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.
ఒంటరిగా కనిపిస్తే అంతే..
కత్తులతో బెదిరించి నగదు, సెల్ఫోన్ల దోపిడీ
వరుస ఘటనలతో భయం గుప్పిట్లో జనం
పోలీసులు మరింత కఠినంగా
వ్యవహరించాలంటున్న నగరవాసులు