
వెంగమాంబ బ్రహ్మోత్సవం
అంగరంగ వైభవం..
దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు మూడురోజులుగా కనుల పండువగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి విచ్చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై వెంగమాంబ – గురవయ్య దంపతుల ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఆలయ సన్నిధిలో సంతానం లేని మహిళలు అమ్మవారి ముందు వరపడ్డారు. ఆలయం నుంచి గ్రామోత్సవం కనుల పండువగా ప్రారంభమై నర్రవాడ, గుదేవారిపాళెం, ఉలవవారిపాళెం మీదుగా సాగింది. అంతకుముందు నర్రవాడలో ఉత్సవ విగ్రహాలకు వేదపండితుల ఆధ్వర్యంలో చక్రస్నానం నిర్వహించారు. వెంగమాంబ దంపతులకు ఏటా పులివర్తి వంశీయులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అయితే ఈ ఏడాది ఆటంకం రావడంతో వారి తరఫున మల్లపాటి చెన్నయ్య – సునీత దంపతులు, నెల్లూరు మహానందం – తిరుపతమ్మ దంపతులు పట్టువ స్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలకు వేదపండితులు ప్రత్యేకాలంకరణ చేసి పూజలు నిర్వహించి అనంతరం గ్రామోత్సవానికి తీసుకెళ్లారు.
నేడు ప్రధాన ఘట్టాలు
ఉత్సవాల్లో భాగంగా బుధవారం ప్రధాన ఘట్టాలు నిర్వహిస్తారు. ఉదయం వడ్డిపాళెం నుంచి నర్రవాడ వరకు పసుపు, కుంకుమ ఉత్సవం, అనంతరం వెంగమాంబ – గురవయ్య దంపతుల కల్యాణోత్సవం, రాత్రి ప్రథానోత్సవం జరుగుతాయి. వీఐపీలతోపాటు భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు ఉదయగిరి సీఐ వెంకట్రావు తెలిపారు.

వెంగమాంబ బ్రహ్మోత్సవం