
లోగ్రేడ్ పొగాకును ప్రభుత్వమే కొనాలి
కందుకూరు: లోగ్రేడ్ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూల వెంకయ్య డిమాండ్ చేశారు. మంగళవారం పామూరు రోడ్డులోని వేలం కేంద్రం వద్ద పొగాకు రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో ధరలు నిరాశాజనకంగా ఉన్నాయన్నారు. కిలో గరిష్ట ధర రూ.280 వేస్తున్నారని, లోగ్రేడ్ ఒకటి, రెండు బేళ్లకు మాత్రమే రూ.180 వేస్తున్నారని చెప్పారు. మిగిలిన వాటిని నోబిడ్ వేయడం వల్ల రైతులు తిరిగి వెనక్కి తీసుకెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మాట్లాడుతూ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కోసం రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ముందుకొచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకుడు ముప్పరాజు కోటయ్య మాట్లాడుతూ సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు రంగంలోకి దిగి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీసీ లాంటి సంస్థలతో లాలూచి పడకుండా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాలేటి కోటేశ్వరరావు, సీపీఎం నాయకులు ఎస్ఏ గౌస్, జి వెంకటేశ్వర్లు, జీవీబీ కుమార్, తానికొండ రమణయ్య, రైతులు వలేటి నరశింహం, అల్లం సుమతి, బ్రహ్మయ్య, మాదాల మాధవ, మామిళ్లపల్లి మాధవ, దామా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
20వ తేదీ ఒంగోలులో
రాష్ట్ర స్థాయి సదస్సు
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ ఒంగోలులోని మల్లలింగయ్య భవన్లో నిర్వహించే రైతు సదస్సును జయప్రదం చేయాలని కార్యవర్గ సభ్యుడు కె.వీరారెడ్డి కోరారు. మంగళవారం కందుకూరులోని ఒకటి, రెండు వేలం కేంద్రాలను సీపీఐ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొగాకు కంపెనీలు సిండికేట్గా ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్ను సాకుగా చూపి ధరలు తగ్గిస్తున్నాయని ఆరోపించారు. గతేడాది హై గ్రేడ్ను క్వింటా రూ.36 వేలకు కొనుగోలు చేస్తే ఈ ఏడాది రూ.28 వేలకు కొంటున్నారన్నారు. మీడియం గ్రేడ్ను రూ.35 వేలకు గతేడాది కొనుగోలు చేస్తే ప్రస్తుతం రూ.25 వేలకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక లోగ్రేడ్ను కొనడమేలేదని వివరించారు. ప్రస్తుతం సరాసరి ధర రూ.243.51 మాత్రమే ఉందని అంటే రోజు రోజుకు ధరలు పతనమవుతున్నట్లు అర్థమవుతుందన్నారు. సదస్సుకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్బాబు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వై.ఆనందమోహన్ తదితరులు పాల్గొన్నారు.