నగాల్‌పై వేటు... యూకీకి చోటు | Yuki Bhambri Replaces Sumit Nagal in the Five-member Davis Cup Squad for Denmark Tie | Sakshi
Sakshi News home page

నగాల్‌పై వేటు... యూకీకి చోటు

Feb 3 2022 5:15 AM | Updated on Feb 3 2022 7:52 AM

Yuki Bhambri Replaces Sumit Nagal in the Five-member Davis Cup Squad for Denmark Tie - Sakshi

న్యూఢిల్లీ: డెన్మార్క్‌తో జరిగే డేవిస్‌ కప్‌ పోరు కోసం ఐదుగురు సభ్యుల భారత జట్టును అఖిల భారత టెన్నిస్‌ సమాఖ్య (ఐటా) సెలక్టర్లు ఎంపిక చేశారు. సుమీత్‌ నగాల్‌ను తప్పించి యూకీ బాంబ్రీకి చోటు కల్పించడం ఈ ఎంపికలో కీలక మార్పు. వరల్డ్‌ గ్రూప్‌–1 ప్లే ఆఫ్‌ ‘టై’లో భాగంగా మార్చి 4, 5 తేదీల్లో భారత్, డెన్మార్క్‌ తలపడనున్నాయి. ఢిల్లీ జింఖానా క్లబ్‌లోని గ్రాస్‌ కోర్టుల్లో రెండు రోజుల పాటు సింగిల్స్, డబుల్స్, రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రపంచ 222వ ర్యాంకర్‌ నగాల్‌ను కాదని 863 ర్యాంకర్‌ యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్‌ రామనాథన్‌ (182), ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ (228)లను సింగిల్స్‌ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు.

డబుల్స్‌లో వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న, దివిజ్‌ శరణ్‌లకు స్థానం కల్పించారు.  గ్రాస్‌ కోర్టు స్పెషలిస్ట్‌ కాకపోవడంతో నగాల్‌పై వేటు పడింది. తెలుగు ఆటగాడు సాకేత్‌ మైనేని, దిగ్విజయ్‌ ప్రతాప్‌ సింగ్‌లను రిజర్వ్‌ ప్లేయర్లుగా ఎంపిక చేసినట్లు ‘ఐటా’ ఒక ప్రకటనలో తెలిపింది. భారత టెన్నిస్‌ జట్టుకు జీషాన్‌ అలీ కోచ్‌గా, రోహిత్‌ రాజ్‌పాల్‌ నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఎంపికైన జట్టు ఈ నెల 23న న్యూఢిల్లీలో బయోబబుల్‌లోకి వెళుతుంది. కరోనా నేపథ్యంలో ‘ఐటా’ సెలక్షన్‌ కమిటీ వర్చువల్‌ పద్ధతిలో సమావేశమై జట్టును ఎంపిక చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement