ఫ్రెంచ్ ఓపెన్లో ష్నైడర్ సంచలన విజయం
పారిస్: తొలి సారి ఫ్రెంచ్ ఓపెన్ సాధించాలని ఆశించిన వరల్డ్ నంబర్వన్ అరైనా సబలెంకా (బెలారస్)కు షాక్ తగిలింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గత ఏడాది రన్నరప్, టాప్ సీడ్ సబలెంకాపై 25వ సీడ్ డియానా ష్నైడర్ సంచలన విజయం సాధించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 2 గంటల 12 నిమిషాల పాటు సాగిన పోరులో 22 ఏళ్ల ష్నైడర్ 3–6, 7–5, 6–0తో గత ఏడాది రన్నరప్ను చిత్తు చేసి తన కెరీర్లో అత్యుత్తమ విజయాన్ని అందుకుంది.
ఒక గ్రాండ్స్లామ్ టోర్నీలో ష్నైడర్ సెమీస్ చేరడం ఇదే మొదటిసారి. కెరీర్లో నాలుగు గ్రాండ్స్లామ్లు గెలిచిన సబలెంకా ఈ పోరులో కూడా ఒక దశలో గెలుపు దిశగా సాగింది. తొలి సెట్ గెలిచిన తర్వాత రెండో సెట్లో 4–1తో ఆధిక్యంలో నిలిచి, ఆపై 5–4 (30–15)తో విజయానికి చేరువైన ఆమె ఒక్కసారిగా ఆటపై పట్టు కోల్పోయింది. చివరి 13 గేమ్లలో 12 గెలిచిన ష్నైడర్ విజయనాదం చేసింది. ఏకంగా 57 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్తో సబలెంకా చేజేతులా మ్యాచ్ను కోల్పోయింది.
మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మాజా ష్వాలిస్కా (పోలండ్) 7–6 (7/3), 6–3 స్కోరుతో అనా కలిస్కయా (రష్యా)పై నెగ్గి సెమీస్లోకి అడుగు పెట్టింది. పురుషుల డబుల్స్లో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీ పోరాటం క్వార్టర్స్లో ముగిసింది. బాలాజీ–డిమోలైనర్ (బ్రెజిల్) జంట 3–6, 4–6 స్కోరుతో రెండో సీడ్ ద్వయం హ్యారీ హీలియోవరా (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) చేతిలో పరాజయంపాలైంది.


