ఐపీఎల్లో అరంగేట్రంలో చేసేందుకు గతేడాది నుంచి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న శ్రీకాకుళం కుర్రాడు, ఆంధ్ర స్టార్ స్పిన్నర్ త్రిపురాన విజయ్ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున విజయ్ అరంగేట్రం చేశాడు.
కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో విజయ్ను రూ.30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగొలు చేసింది. కానీ గత సీజన్లో అతడికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. బెంచ్కే పరిమితమైనా ఏ మాత్రం నిరాశ చెందుకుండా నిత్యం నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ కన్పించాడు. ఇప్పుడు ఎట్టకేలకు అతడి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. స్పీడ్ స్టార్ అకిబ్ నబీ స్ధానంలో విజయ్ను తుది జట్టులోకి ఢిల్లీ తీసుకుంది. విజయ్కు రైట్- ఆర్మ్ ఆఫ్బ్రేక్తో పాటు బ్యాట్తో రాణించే సత్తా ఉంది.
ఎవరీ విజయ్?
24 ఏళ్ల త్రిపురాన విజయ్ శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్కు ఎంపికైన మొదటి క్రికెటర్గా ఇప్పటికే గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్లో నివాసం ఉంటున్న త్రిపురాణ వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ప్రస్తుతం విజయ్ టెక్కలిలోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు.
అండర్–19లో ఏసీఏ నార్త్జోన్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో ఆంధ్ర సీనియర్ జట్టు నుంచి 2021లో విజయ్కు తొలిసారి పిలుపు వచ్చింది. లిస్ట్-ఎ క్రికెట్లో జమ్మూ కాశ్మీర్పై అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఏడాదికే విజయ్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. రెడ్ బాల్ క్రికెట్లో విజయ్ ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు.
విజయ్ ఇప్పటివరకు 16 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా అతడు లిస్ట్-ఎలో 5, టీ20ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో తన మార్క్ చూపించేందుకు విజయ్ సిద్దమయ్యాడు.
చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు


