ఒలింపిక్స్‌లో స్వర్ణం మిస్సయిన మిల్కా సింగ్‌..

When Milkha Singh Missed Out on Olympic Medal By A Whisker - Sakshi

1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో చోటు చేసుకున్న సంఘటన

న్యూఢిల్లీ: జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి నిత్యం శ్రమించాలి. ఏమాత్రం ఏమారపాటుగా ఉన్న వెంటుకవాసిలో ఓటమి పాలవుతాం. చదువు విషయానికి వస్తే పరీక్షల ముందు ప్రిపేరషన్‌ ప్రారంభించినా సరిపోతుందేమో కానీ.. క్రీడల విషయంలో మాత్రం అలా కాదు. ప్రతిరోజు ప్రాక్టీస్‌ చేయాలి. ఒలింపిక్స్‌ జరిగేది నాలుగేళ్లకోసారి కదా.. మూడో ఏట నుంచి ప్రాక్టీస్‌ మొదలు పెడతానంటే సరిపోదు. నాలుగేళ్లు శ్రమిస్తేనే మన కల సాకారం అవుతుంది అంటారు అభినవ్‌ బింద్రా. 

ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డ్‌ సృష్టించారు అభినవ్‌ బింద్రా. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించారు. అయితే అభినవ్‌ విజయం కన్నా దాదాపు 50 ఏళ్ల ముందే భారత్‌ ఖాతాలో ఈ రికార్డు నమోదయ్యేది. అది కూడా పరుగుల వీరుడు, ఫ్లయింగ్‌ సిక్‌ మిల్కా సింగ్‌ వల్ల. కానీ దురదృష్టం కొద్ది ఆ అవకాశం చేజారింది. ఈ విషయాన్ని స్వయంగా మిల్కా సింగ్‌ తెలిపారు. ఇండియాటుడేకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీని గురించి వెల్లడించారు. ఆ వివరాలు.. 

1958లో జరిగిన కామన్‌వెల్త్‌ క్రీడల్లో 200మీటర్లు, 400 మీటర్ల విభాగంలో మిల్కా సింగ్‌ స్వర్ణం గెలిచారు. ఆ తర్వాత మిల్కా సింగ్‌ లక్ష్యం 1960లో జరిగిన రోమ్‌ ఒలింపిక్స్‌. అందుకోసం తీవ్రంగా శ్రమించారు మిల్కా సింగ్‌. అప్పటికి ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు మిల్కా సింగ్‌ స్వర్ణం గెలుస్తారని భావించారు. కానీ దురదృష్టం కొద్ది ఆయన నాలుగో స్థానానికే పరిమితం అయ్యారు. ఈ బాధ తనను జీవితాంతం వెంటాడుతుందన్నారు మిల్కా సింగ్‌.

ఇండియాటుడేకిచ్చిన ఇంటర్వ్యూలో మిల్కా సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో సెమి ఫైనల్స్‌, ఫైనల్స్‌ మధ్య రెండు రోజుల విరామం ఉంది. ఆ 2 రోజులు నామీద విపరీతమైన ఒత్తిడి ఉంది. ప్రపంచం నన్ను గమనిస్తుంది.. నేను తప్పక విజయం సాధించాలని భావించాను. రోమ్‌కు వెళ్లడానికి ముందు ప్రతి ఒక్కరు నేను 400మీటర్ల విభాగంలో స్వర్ణం సాధిస్తానని భావించారు. రేసులో నేను ముందంజలో ఉన్నాను. 200మీటర్ల దూరాన్ని 21 సెకన్లలో పూర్తి చేశాను. ఇప్పటివారికి ఇది పూర్తిగా అసాధ్యం. అయితే అదే వేగంతో వెళ్తే నేను రేస్‌ పూర్తి చేయలేనని భావించి నా వేగాన్ని కాస్త తగ్గించాను. అదే నేను చేసిన పెద్ద తప్పదం. ఆ తర్వాత నేను ఎంత ప్రయత్నించినా మునుపటి వేగాన్ని అందుకోలేకపోయాను. ఫలితంగా నాలుగో స్ధానంలో నిలిచాను. ఇది నా దురదృష్టం కాదు.. ఇండియాది. చనిపోయే వరకు ఈ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది’’ అన్నారు మిల్కా సింగ్‌. ఈ రేస్‌లో మిల్కా సింగ్‌ 45.6 సెకండ్స్‌తో నాలుగో స్థానంలో నిలవగా అమెరికాకు చెందిన ఓటిస్‌ డేవిస్‌ 44.9 సెకండ్స్‌లో రేసు ముగించి స్వర్ణం గెలిచాడు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top