టీమిండియా దిగ్గజ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి 2025వ సంవత్సరం చివరి రోజు కూడా ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది చివరి రోజు విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని, రెండో స్థానానికి ఎగబాకిన విరాట్.. చరిత్రలో అత్యధిక సార్లు (10) టాప్-2లో (ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో) సంవత్సరాన్ని ముగించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
నేటికి ముందు ఈ రికార్డును విరాట్ మరో దిగ్గజ బ్యాటర్, విండీస్ యోధుడు వివ్ రిచర్డ్స్ (9), సౌతాఫ్రికా లెజండరీ ఆల్రౌండర్ షాన్ పొల్లాక్తో (9) కలిసి షేర్ చేసుకున్నాడు. తాజాగా సింగిల్గా ఈ ప్రపంచ రికార్డును కబ్జా చేశాడు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో వరుసగా 2017, 2018, 2019, 2020 సంవత్సరాలను టాప్-1 బ్యాటర్గా ముగించిన విరాట్.. 2013, 2014, 2015, 2016, 2021, 2025 సంవత్సరాలను రెండో నంబర్ బ్యాటర్గా ముగించాడు.
డిసెంబర్ నెలలో సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో రెండు శతకాలు, ఓ అర్ధశతకం సాయంతో 302 పరుగులు చేసిన విరాట్.. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకాడు.
2025ను నంబర్ వన్ బ్యాటర్గా ముగించిన ఆటగాడు మరో భారత దిగ్గజం రోహిత్ శర్మ కావడం మరో విశేషం. రోహిత్కు విరాట్కు రేటింగ్ పాయింట్ల పరంగా కేవలం 8 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. రోహిత్ ఖాతాలో 781 పాయింట్లు ఉండగా.. విరాట్ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి.
ఈ ఏడాదే టెస్ట్లకు, అంతకుముందు ఏడాది టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. వన్డేల్లో ఈ ఏడాది అద్భుత ప్రదర్శనలు కనబర్చాడు. 13 మ్యాచ్ల్లో 3 శతకాల సాయంతో 651 పరుగులు చేశాడు. ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్పై శతకం ప్రత్యేకంగా నిలిచిపోతుంది.


