లండ‌న్‌లో కోహ్లి స్థిర‌నివాసం..? ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మంలో ప్రత్యక్షం! వీడియో | Virat Kohli-Anushka Sharma Attend Krishna Das Kirtan In London, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

లండ‌న్‌లో కోహ్లి స్థిర‌నివాసం..? ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మంలో ప్రత్యక్షం! వీడియో

Jul 14 2024 11:43 AM | Updated on Jul 14 2024 12:38 PM

Virat Kohli-Anushka Sharma attend Krishna Das Kirtan in London

టీ20 వరల్డ్‌కప్‌-2024 విజయం అనంతరం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. విరాట్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. వరల్డ్‌కప్ విజయోత్సవ యాత్రం ముగిసిన మరుసటి రోజే తన భార్య పిల్లలను చూసేందుకు కోహ్లి లండన్‌కు పయనమయ్యాడు.

అక్కడ హాలిడేస్‌ను కోహ్లి తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్ అత‌డి భార్య అనుష్క శర్మ ఇద్ద‌రూ లండ‌న్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక గాయకుడు కృష్ణ దాస్ కీర్తనకు హాజర‌య్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

కాగా కృష్ణ దాస్ కీర్తనలకు విరాట్‌-అనుష్క సూప‌ర్ క‌పుల్ హాజ‌రుకావ‌డం ఇదేమి తొలిసారి కాదు. ఇంత‌కుముందు చాలా సార్లు ఈ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మంలో క‌న్పించారు. అదే విధంగా కృష్ణ దాస్ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబాను సైతం విరాట్‌, అనుష్క ఎక్కువ‌గా ఆరాధిస్తారు. కాగా లండన్‌లో విరాట్ కోహ్లి స్థిర‌నివాసం ఏర్పరచుకోవాలని భావిస్తున్నట్లు చాలా రోజులగా ప్రచారం జరుగుతోంది.

విరాట్ ఇటీవల కాలంలో ఎ‍క్కువగా లండన్‌లోనే గడుపుతుండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. విరాట్ కొడుకు అకాయ్ కూడా లండన్‌లోనే జన్మించడం గమనార్హం. ఇప్పటివరకు ఆకాయ్‌ను కోహ్లి భారత్‌కు తీసుకురాలేదు. విరుష్క జంట లండ‌న్‌లో ఓ లిస్టెడ్ కంపెనీ క‌లిగి ఉంది. మ్యాజిక్ ల్యాంప్ డైరెక్టర్లుగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు ఉన్నారు.

ఇవన్నీ చూస్తుంటే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన త‌రువాత కోహ్లి, అనుష్క‌శ‌ర్మ‌లు లండ‌న్‌లో స్థిర‌ప‌డే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఇప్పటికే టీ20లకు విడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేలు, టెస్టుల్లొ కొనసాగనున్నాడు. అయితే ఈ నెలలో జరిగే శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అతడు దూరం కానున్నాడు. అతడు తిరిగి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు జట్టుతో చేరే అవకాశముంది.

 

Advertisement
 
Advertisement
Advertisement