
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు వన్డే ప్రపంచకప్-2023 జట్టులో చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. అంతకుముందు ఆసియాకప్కు కూడా చాహల్ను పరిగణలోకి తీసుకోలేదు. కాగా చాహల్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీల్లో బీజీగా ఉన్నాడు.
కెంట్ క్రికెట్ క్లబ్కు చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే తనను వరల్డ్కప్కు ఎంపిక చేయకపోవడంపై తాజాగా చాహల్ స్పందించాడు. జట్టులో చోటు దక్కించుకోపోవడం తనకు అలవాటు అయిందని, అది తన జీవితంలో ఒక భాగమైందని చాహల్ చెప్పుకొచ్చాడు.
"ఇది వరల్డ్కప్. జట్టులో పదిహేను మంది ఆటగాళ్ళు మాత్రమే ఉండాలి. 17 లేదా 18 ప్లేయర్స్ను ఎంపిక చేయలేరు. ఆ విషయం నాకు తెలుసు. అయితే జట్టులో చోటు దక్కించుకోపోయినందుకు కొంచెం బాధగా ఉంది. కానీ కష్టపడుతూ జీవితంలో ముందుకు సాగడమే నా మోటివ్.
నాకు ఇది అలవాటు అయిపోయింది. వరల్డ్కప్లో చోటు దక్కకపోవడం నాకు ఇది మూడో సారి అంటూ నవ్వుతూ" విజ్డెన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. అదే విధంగా ఎక్కడో ఒక చోట క్రికెట్ ఆడాలన్న ఉద్దేశ్యంతో ఇంగ్లండ్ కౌంటీల్లో భాగమయ్యానని చాహల్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: 'అశ్విన్ ఎంపికలో ఆశ్చర్యమేమీలేదు.. చెన్నైలో చుక్కలు చూపిస్తాడు'