తిప్పేసిన స్పిన్నర్లు.. శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

Under 19 Womens T20 WC 2023: Parshavi Chopra Spell Makes India To Win Vs Sri Lanka - Sakshi

Under 19 Womens T20 World Cup 2023: ఐసీసీ అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత అమ్మాయిలు అదరగొడుతున్నారు. గ్రూప్‌ దశలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచిన భారత్‌.. సూపర్‌ సిక్స్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైనప్పటికీ, మరుసటి మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుని శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్లు పర్శవి చోప్రా (4-1-5-4), మన్నత్‌ కశ్యప్‌ (4-1-16-2), అర్చనా దేవీ (4-0-15-1) అద్భుతమైన గణాంకాలు నమోదు చేసి లంకేయులను తిప్పేశారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 59 పరుగులు మాత్రమే చేయగలిగింది. పర్శవి, మన్నత్‌, అర్చనాతో పాటు టిటాస్‌ సాధు (3-0-10-1) ఓ వికెట్‌ పడగొట్టగా.. సోనమ్‌ యాదవ్‌ (3-0-7-0), షెఫాలీ వర్మ (2-0-6-0) వికెట్లు పడగొట్టకున్నా పొదుపుగా బౌలింగ్‌ చేశారు.

 
అనంతరం 60 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. 7.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అడుతూ పాడుతూ విజయం సాధించింది. షెఫాలీ వర్మ (15), శ్వేత సెహ్రావత్‌ (13), రిచా ఘోష్‌ (4) తక్కువ స్కోర్లకే ఔటైనప్పటికీ సౌమ్య తివారి (15 బంతుల్లో 28; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చింది. లంక బౌలర్లలో దేవ్మీ విహంగ 3 వికెట్లు పడగొట్టింది. ఈ గెలుపుతో భారత్‌.. సూపర్‌ సిక్స్‌ గ్రూప్‌-1లో రెండో స్థానానికి ఎగబాకింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top