తెలంగాణ ‘డ్రా’తో మొదలు | Telangana drawn in second round of Santosh Trophy National Football Championship | Sakshi
Sakshi News home page

తెలంగాణ ‘డ్రా’తో మొదలు

Dec 15 2024 3:51 AM | Updated on Dec 15 2024 3:51 AM

Telangana drawn in second round of Santosh Trophy National Football Championship

రాజస్తాన్‌తో 1–1తో డ్రా 

సంతోష్‌ ట్రోఫీ ఫుట్‌బాల్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: ఐదున్నర దశాబ్దాల తర్వాత హైదరాబాద్‌ గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక సంతోష్‌ ట్రోఫీ జాతీయ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ (రెండో రౌండ్‌)లో తెలంగాణ ‘డ్రా’తో  మొదలు పెట్టింది. శ్రీనిధి ఫుట్‌బాల్‌ క్లబ్‌ గ్రౌండ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ, రాజస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ 1–1 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణితో ఆడాయి. అడపాదడపా తెలంగాణ స్ట్రయికర్లు ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌ లక్ష్యంగా స్కోరు చేసేందుకు చేసిన ప్రయత్నాల్ని రాజస్తాన్‌ డిఫెండర్లు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

అలాగే రాజస్తాన్‌ దాడుల్ని తెలంగాణ రక్షణ పంక్తి నిలువరించడంతో మొదటి అర్ధభాగం ఒక్క గోల్‌ అయినా నమోదుకు కాకుండానే 0–0తో ముగిసింది. ద్వితీయార్ధం మొదలైన ఎనిమిది నిమిషాలకే రాజస్తాన్‌ ఖాతా తెరిచింది. 53వ నిమిషంలో ఫార్వర్డ్‌ ఆటగాడు అమిత్‌ గోడార చక్కని సమన్వయంతో తెలంగాణ డిఫెండర్లను బోల్తాకొటిస్తూ గోల్‌ను లక్ష్యానికి చేర్చడంతో రాజస్తాన్‌ 1–0తో ఆధిక్యంలో వెళ్లింది. 

తర్వాత స్కోరు సమం చేసేందుకు తెలంగాణ స్ట్రయికర్లు ఎంతగా శ్రమించినా ఫినిషింగ్‌ లోపాలతో గోల్‌ అయితే కాలేదు. ఇక పరాజయం ఖాయమనుకున్న దశలో అనూహ్యంగా తేజావత్‌ సాయి కార్తీక్‌ ఆఖరి నిమిషంలో అద్భుతం చేశాడు. 90వ నిమిషంలో చాకచక్యంగా సాయి కార్తీక్‌ చేసిన గోల్‌తో తెలంగాణ 1–1తో గట్టెక్కింది. గోల్‌ పోస్ట్‌ వద్ద రాజస్తాన్‌ స్ట్రయికర్లను నిలువరించిన తెలంగాణ డిఫెండర్‌ తజాముల్‌ హుస్సేన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 

టోర్నీ రెండో రౌండ్‌లో మొత్తం 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. టాప్‌–4లో నిలిచిన టీమ్‌లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. శనివారం జరిగిన ఇతర మ్యాచ్‌లలో  బెంగాల్‌ 3–1తో జమ్మూ కశీ్మర్‌పై... మణిపూర్‌ 1–0తో సరీ్వసెస్‌పై గెలుపొందాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement