రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో అదరగొడుతున్న దిగ్గజ ఆటగాళ్లు

Srilanka Legends Beat WestIndies Legends In Road Safety Series - Sakshi

రాయ్‌పూర్: అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏళ్లు గడిచినా.. దిగ్గజ ఆటగాళ్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా మొన్న బంగ్లా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (80 నాటౌట్; 35 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు‌) మెరుపులు మెరిపించగా.. నిన్న విండీస్ ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ బ్రియాన్ లారా (49 బంతుల్లో 8 ఫోర్లతో 53 నాటౌట్), శ్రీలంక దిగ్గజ ఆటగాడు ఉపుల్ తరంగ(35 బంతుల్లో 8 ఫోర్లుతో 53 నాటౌట్)లు సత్తా చాటాడు. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక లెజెండ్స్.. విండీస్‌ లెజెండ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విం‍డీస్‌ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. విండీస్‌ కెప్టెన్ బ్రియాన్ లారా(53 నాటౌట్), డ్వేన్ స్మిత్ (27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47) రాణించారు. శ్రీలంక బౌలర్లలో తిలకరత్నే దిల్షాన్, చింతక జయసింఘే చెరో వికెట్ తీశారు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్.. ఉపుల్ తరంగా(53 నాటౌట్) అజేయ అర్ధశతకంతో చెలరేగడంతో 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

తరంగాకు తోడుగా తిలకరత్నే దిల్షాన్(37 బంతుల్లో 8 ఫోర్లతో 47) రాణించాడు. విండీస్ బౌలర్లలో టినో బెస్ట్, సులేమాన్ బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ర్యాన్ ఆస్టిన్ ఓ వికెట్ పడగొట్టారు. కీలక ఇన్నింగ్స్‌ అడిన తరంగాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఆదివారం జరుగనున్న తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ లెజెండ్స్‌తో, బంగ్లా దిగ్గజాలు తలపడనున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top