హంబంటోటా వేదికగా భారత అండర్-19 జట్టుతో జరిగిన రెండో అనాధికారిక వన్డేలో 8 వికెట్ల తేడాతో శ్రీలంక అండర్-19 జట్టు ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 285 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 48 ఓవర్లలోనే చేధించింది.
శ్రీలంక ఓపెనర్ దిమంత మహావితన(153 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్లతో 155) భారీ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు సెనుజ వెకునగోడ(60), విమత్ దినసార(60 బంతుల్లో 56) ఆర్ధ శతకాలతో రాణించారు. బారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇషాన్ సూద్, వినోద్ మాత్రమే తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది.
ద్రవిడ్ కొడుకు మెరుపులు వృధా
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 47.2 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. 82 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిని భారత జట్టును.. లెజెండరీ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ తనయడు ఆన్వయ్ ద్రవిద్ ఆదుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ అర్జున్ రాజ్పుత్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు.
వీరిద్దరూ ఐదో వికెట్కు 145 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆన్వయ్ కేవలం 67 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్తో 87 పరుగులు చేశాడు. ఏదేమైనప్పటికి భారత్ ఓడిపోవడంతో జూనియర్ ద్రవిడ్ మెరుపు ఇన్నింగ్స్ వృధా అయిపోయింది. శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే హంబంటోటా వేదికగానే జరగనుంది.


