న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియా క్రీడల ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ కైవసం చేసుకుంది. దీంతో ఏషియన్ గేమ్స్ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ చానల్స్తో పాటు సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. చైనా వేదికగా జరిగిన గత ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే.
‘ఆసియా క్రీడా మహోత్సవ ప్రసార హక్కులు దక్కించుకోవడం గర్వంగా ఉంది. సోనీ టీవీకి ఈ అవకాశం రావడం ఇది మూడోసారి’ అని సోనీ నెట్వర్క్ ప్రతినిధి రాజేశ్ కౌల్ అన్నారు. జపాన్ వేదికగా జరగనున్న ఏషియన్ గేమ్స్లో మొత్తం 41 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో 32 ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి. వీటితో పాటు మిక్స్డ్ మార్షల్, సర్ఫింగ్ వంటి కొత్త క్రీడలను సైతం ఇందులో చేర్చారు.
ఈ క్రీడల్లో భాగంగా క్రికెట్, టెన్నిస్, కబడ్డీ, సెపక్తక్రా, కురాశ్ వంటి పలు క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ‘గత ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చంది. తొలిసారి వంద పతకాల మైలురాయిని దాటింది. ఇది దేశంలో పెరుగుతున్న క్రీడా సంస్కృతికి నిదర్శనం. ఈసారి అంతకుమించిన ప్రదర్శనతో రికార్డులు తిరగరాయడం ఖాయమే. అలాంటి స్ఫూర్తిదాయక క్షణాలను ప్రసారం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని రాజేశ్ వెల్లడించారు.


