వైరల్‌ అవుతున్న రిషబ్‌ పంత్‌ పాత ఫోటో​

Rishabh Pant Old Picture With Ashish Nehra Goes Viral - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా విధ్వంసకర ఆటగాడు రిషబ్‌ పంత్‌కు చెందిన ఓ పాత ఫోటోగ్రాఫ్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో పంత్‌ భారత మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా ఆటోగ్రాఫ్‌ తీసుకుంటూ కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారి, సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. గతంలో టీమిండియా సారధి విరాట్‌ కోహ్లి కూడా అచ్చం ఇలానే ఆశిష్‌ నెహ్రాతో ఆటోగ్రాఫ్‌ తీసుకుంటూ కనిపించాడు. దానికి సంబంధించిన ఫోటో కూడా గతంలో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ రెండు ఫోటోలను పోలుస్తూ సోషల్‌ మీడియాలో పెద్ద డిస్కషనే నడుస్తోంది. వీటిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ.. కామెంట్లు పెడుతున్నారు. ఈ రెండు ఫోటోలకు చాలా దగ్గరి సంబంధాలు ఉండటంతో కోహ్లితో పంత్‌ను పోలుస్తూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. 

కోహ్లి, పంత్‌ల సక్సెస్‌కు నెహ్రా ఆటోగ్రాఫే కారణమని కొందరంటుంటే.. మరి కొందరేమో నెహ్రా హస్తవాసి చాలా బాగుందని.. ఆయన ఆటోగ్రాఫ్‌ తీసుకుంటే క్రికెటర్లు స్టార్లయిపోతారని కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ ముగ్గురు క్రికెటర్లు దేశవాళి క్రికెట్‌లో ఢిల్లీ జట్టకే ప్రాతినిధ్యం వహించారు. కాగా, శనివారం ఇంగ్లండ్‌తో ముగిసిన ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌లో అద్భుతమైన శతకంతో(118 బంతుల్లో 101; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టిన పంత్‌.. టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో పంత్‌కు తోడుగా వాషింగ్టన్‌ సుందర్‌(96 నాటౌట్‌) రాణించడంతో భారత్‌కు కీలకమైన తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. దీంతో పట్టుబిగించిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్ధిని 135 పరుగులకే ఆలౌట్‌ చేసి ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top