
భారత హాకీ దిగ్గజ ప్లేయర్ రాణీ రాంపాల్ రిటైర్మెంట్ ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో తన పదహారేళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికింది. ‘‘బాల్యంలో పేదరికంలో మగ్గిపోయాను. అయితే, ఆటపై ఉన్న ఆసక్తి నన్ను ఇక్కడిదాకా తీసుకువచ్చింది.
దేశం తరఫున ఆడే అవకాశం వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. నా ప్రయాణం కూడా ఇంత అద్భుతంగా సాగుతుందని ఊహించలేదు’’ అంటూ ఆటకు వీడ్కోలు చెబుతున్న సందర్భంగా 29 ఏళ్ల రాణీ రాంపాల్ ఉద్వేగానికి లోనైంది.
కాగా హర్యానాకు చెందిన రాణీ పద్నాలుగేళ్ల వయసులోనే అంతర్జాతీయ హాకీలో అడుగుపెట్టింది. 2008 ఒలింపిక్ క్వాలిఫయర్స్ సందర్భంగా తొలిసారి భారత్కు ప్రాతినిథ్యం వహించింది. ఇప్పటి వరకు తన కెరీర్లో దేశం తరఫున 254 మ్యాచ్లు ఆడిన రాణీ రాంపాల్ 205 గోల్స్ కొట్టింది.
భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్గా ఎదిగిన రాణీ రాంపాల్.. సారథిగా తనదైన ముద్ర వేసింది. టోక్యో ఒలింపిక్స్ 2021లో భారత జట్టును నాలుగో స్థానంలో నిలపడం తన కెరీర్లో రాణీ సాధించిన అత్యుత్తమ విజయం. ఇక రిటైర్మెంట్ తర్వాత జాతీయ స్థాయిలో జూనియర్ మహిళా జట్టు కోచ్గా రాణీ వ్యవహరించనుంది.
రాణీ రాంపాల్ సాధించిన విజయాలు
2014 ఆసియా క్రీడల్లో కాంస్యం
2018 ఆసియా క్రీడల్లో రజతం
ఆసియాకప్లో మూడు పతకాలు
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో మూడు పతకాలు సాధించిన జట్టులో సభ్యురాలు(2016లో స్వర్ణం)
2016 దక్షిణాసియా క్రీడల్లో భారత్ పసిడి పతకం గెలవడంలో కీలక పాత్ర
రాణీ రాంపాల్ అందుకున్న పురస్కారాలు
2020లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు
20202లోనే పద్మశ్రీ అవార్డు.