కింగ్స్‌ పంజాబ్‌కు బ్రేక్‌

Rajasthan Royals Beat Kings Punjab By 7 Wickets - Sakshi

రాజస్తాన్‌ ఘన విజయం

అబుదాబి: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌ జైత్రయాత్రకు బ్రేక్‌పడింది. వరుసగా ఐదు విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్న కింగ్స్‌ పంజాబ్‌కు రాజస్తాన్‌ రాయల్స్‌ అడ్డుకట్టవేసింది. కింగ్స్‌ పంజాబ్‌ నిర్దేశించిన 186 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్‌ 17.3 ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెన్‌స్టోక్స్‌(50;26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్‌((48; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించగా, రాబిన్‌ ఊతప్ప(30; 23 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. చివర్లో స్టీవ్‌ స్మిత్‌(31 నాటౌట్‌; 20 బంతుల్లో 5 ఫోర్లు), బట్లర్‌( 22 నాటౌట్‌;11 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించడంతో రాజస్తాన్‌ 15 బంతులు ఉండగానే విజయం సాధించింది. దాంతో ఈ సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్తాన్‌ విజయం సాధించినట్లయ్యింది.  (ప్లేఆఫ్స్‌ రేసు: ఎవరికి ఎంత అవకాశం?)

లక్ష్య ఛేదనలో స్టోక్స్‌, ఊతప్పలు రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 5.3 ఓవర్లలో 60 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ప్రధానం స్టోక్స్‌ దూకుడుగా ఆడి విలువైన పరుగులు సాధించాడు. కాగా, హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత స్టోక్స్‌ ఔట్‌ కాగా, ఊతప్ప, సంజూ శాంసన్‌లు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. శాంసన్‌ కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు.  ప్రతీ వికెట్‌కు విలువైన భాగస్వామ్యం సాధించడంతో రాజస్తాన్‌ అవలీలగా గెలిచింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.  క్రిస్‌ గేల్‌ (99; 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌(46;41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించడంతో పాటు పూరన్‌(22; 10 బంతుల్లో 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించడంతో పంజాబ్‌ పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. రాజస్తాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో కింగ్స్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను రాహుల్‌, మన్‌దీప్‌ సింగ్‌లు ఆరంభించారు. కాగా,  ఆడిన తొలి బంతికి మన్‌దీప్‌ సింగ్‌ గోల్డెన్‌ డక్‌ అయ్యాడు.

ఆర్చర్‌ వేసిన తొలి ఓవర్‌ ఆఖరి బంతికి మన్‌దీప్‌.. స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను రాహుల్‌, గేల్‌లు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించడంతో కింగ్స్‌ గాడిలో పడింది. ఈ జోడి తమదైన శైలిలో రాజస్తాన్‌పై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ప్రధానంగా రాహుల్‌ ఔటైన తర్వాత గేల్‌ చెలరేగి ఆడాడు. పూరన్‌తో కలిసి 41 పరుగుల భాగస్వామ్యం, మ్యాక్స్‌వెల్‌తో కలిసి 22 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు గేల్‌. కాగా, సెంచరీ పరుగు దూరంలో గేల్‌ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. ఆర్చర్‌ వేసిన ఆఖరి ఓవర్‌ నాల్గో బంతి గేల్‌ బ్యాట్‌ను తాకి వికెట్ల గిరాటేయడంతో పెవిలియన్‌ చేరాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top