అశ్విన్‌ వాటే ఓవర్‌..! | Rabada Gets Maxwell After Ashwin Strikes | Sakshi
Sakshi News home page

అశ్విన్‌ వాటే ఓవర్‌..!

Sep 20 2020 10:39 PM | Updated on Sep 20 2020 10:39 PM

Rabada Gets Maxwell After Ashwin Strikes - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సూపర్‌ బ్రేక్‌ ఇచ్చాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు సాధించి కింగ్స్‌ పంజాబ్‌ను కష్టాల్లో పడేశాడు.  ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ అందుకున్న అశ్విన్‌..  తొలి బంతికి కరుణ్‌ నాయర్‌(1)ను పెవిలియన్‌కు పంపాడు. ఇక అదే ఓవర్‌ ఐదో బంతికి నికోలస్‌ పూరన్‌(0)ను బౌల్డ్‌ చేశాడు. ఆ ఓవర్‌లో అశ్విన్‌ రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్య ఛేదనలో కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. కింగ్స్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(21; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. మోహిత్‌ శర్మ వేసిన ఐదో ఓవర్‌ మూడో బంతికి రాహుల్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఇన్‌కట్టర్‌ను అంచనా వేయడంలో విఫలం కావడంతో బౌల్డ్‌గా నిష్క్రమించాడు. అనంతరం కరుణ్‌ నాయర్‌, పూరన్‌లు ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరారు. ఆపై మ్యాక్స్‌వెల్‌(1) కూడా ఔటయ్యాడు. రబడా బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లలో కింగ్స్‌ పంజాబ్‌ సగం వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. ఒకవైపు ఓపెనర్‌గా వచ్చిన మయాంక్‌ అగర్వాల్‌ క్రీజ్‌లో ఉండగానే వచ్చిన బ్యాట్స్‌మన్‌ వచ్చినట్లు పెవిలియన్‌ చేరడంతో కింగ్స్‌ పంజాబ్‌ ఒత్తిడిలోకి వెళ్లింది.  (చదవండి:స్టోయినిస్‌ చెలరేగిపోయాడు..)

అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఢిల్లీ కష్టాల్లో పడ్డ సమయంలో స్టోయినిస్‌ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును నిలబెట్టాడు. . 20 బంతుల్లో  సిక్స్‌లు, ఫోర్లు మోత మోగించి హాఫ్‌ సెంచరీ సాధించాడు. దాంతో ఢిల్లీ స్కోరు బోర్డును 150 పరుగులు దాటింది. ఢిల్లీ 110 పరుగులైనా చేస్తుందా అనే సమయంలో స్టోయినిస్‌ చెలరేగిపోయాడు.  బౌలర్‌ ఎవరైనా వీరబాదుడే లక్ష్యంగా బౌండరీల మోత మోగించాడు. కాట్రెల్‌ వేసిన 19 ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన స్టోయినిస్‌.. చివరి ఓవర్‌లో మాత్రం ఐదు బంతుల్ని బౌండరీ దాటించాడు. జోర్డాన్‌ వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతిని సిక్స్‌ కొట్టిన స్టోయినిస్‌.. రెండో బంతిని ఫోర్‌ కొట్టాడు. మూడు, నాలుగు బంతుల్ని ఫోర్లు కొట్టిన స్టోయినిస్‌.. ఐదో బంతిని సిక్స్‌ కొట్టాడు. ఆరో బంతి నో బాల్‌ కాగా, స్టోయినిస్‌ రనౌట్‌ అయ్యాడు. చివరి ఓవర్‌లో 24 పరుగుల్ని స్టోయినిస్‌ రాబట్టాడు.  21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 పరుగుల్ని స్టోయినిస్‌ సాధించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. స్టోయినిస్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, కాట్రెల్‌ రెండు వికెట్లు సాధించాడు. రవిబిష్నోయ్‌కి వికెట్‌ దక్కింది.  రిషభ్‌ పంత్‌ భారీ షాట్‌ ఆడే క్రమంలో బౌల్డ్‌ అయ్యాడు. రవిబిష్నోయ్‌ స్పిన్‌ చేస్తూ కాళ్ల మధ్య వేసిన బంతిని ఆడబోయి పంత్‌ వికెట్‌ను సమర్పించుకున్నాడు. పంత్‌ 14 ఓవర్‌ చివరి బంతికి ఔట్‌ అయితే, ఆపై 15 ఓవర్‌ తొలి బంతికి అయ్యర్‌ ఔటయ్యాడు. పంత్‌ వెనకాలే అయ్యర్‌ ఔట్‌ కావడంతో ఢిల్లీ మరోసారి కష్టాల్లో పడింది. 87 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయిన తరుణంలో స్టోయినిస్‌ స్వరూపాన్ని మొత్తం మార్చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement