Ban Vs Pak: చివరి బంతికి గట్టెక్కిన పాక్.. బంగ్లాదేశ్‌పై విజయం.. 3–0తో క్లీన్‌స్వీప్‌

Pakistan Win Last Ball Thriller Against Bangladesh In 3rd T20 - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌తో ఉత్కంఠగా సాగిన మూడో టి20లో చివరి బంతికి నెగ్గిన పాకిస్తాన్‌ ఊపిరి పీల్చుకుంది. 125 పరుగుల స్వల్ప లక్ష్యంతో పాక్‌ ఛేదనను మొదలు పెట్టగా... ఆ జట్టు బ్యాటర్స్‌ మరీ నెమ్మదిగా ఆడారు. దాంతో విజయం కోసం పాకిస్తాన్‌ ఆఖరి ఓవర్లో 8 పరుగులు చేయాల్సి వచ్చింది. బౌలింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌ సారథి మహ్ముదుల్లా తొలి బంతికి పరుగు ఇవ్వలేదు. రెండు, మూడు బంతులకు వరుసగా సర్ఫరాజ్‌ అహ్మద్‌ (6), హైదర్‌ అలీ (38 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లను అవుట్‌ చేశాడు.

దాంతో పాక్‌ శిబిరంలో కలవరం మొదలైంది. అయితే క్రీజులోకి వచ్చిన ఇఫ్తిఖార్‌ అహ్మద్‌ (2 బంతుల్లో 6; 1 సిక్స్‌) నాలుగో బంతికి సిక్సర్‌ బాదాడు. తర్వాతి బంతికి అతడు వెనుదిరగడంతో ఉత్కంఠ తార స్థాయికి చేరింది. చివరి బంతికి రెండు పరుగులు చేస్తే గెలుపు ఖాయం అన్న తరుణంలో మొహమ్మద్‌ నవాజ్‌ (4; 1 ఫోర్‌) ఫోర్‌ బాది పాక్‌ను గట్టెక్కించాడు. దాంతో మూడో టి20లో పాకిస్తాన్‌ ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచి సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులు చేసింది. ఓపెనర్‌ నైమ్‌ (50 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. ఛేదనలో పాకిస్తాన్‌ సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసి నెగ్గింది. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన హైదర్‌ అలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మొహమ్మద్‌ రిజ్వాన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు ఈనెల 26న మొదలవుతుంది. 

చదవండి: Ind Vs Nz 2021 T20 Series: టీమిండియా సరికొత్త రికార్డు.. ఏకంగా ఆరు సార్లు..

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top