నవ శకానికి నాంది | Neeraj Chopra Classic event starts today | Sakshi
Sakshi News home page

నవ శకానికి నాంది

Jul 5 2025 3:13 AM | Updated on Jul 5 2025 3:13 AM

Neeraj Chopra Classic event starts today

నేడు ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ ఈవెంట్‌

భారత్‌లో తొలి అంతర్జాతీయ జావెలిన్‌ టోర్నీ

ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న నీరజ్‌ చోప్రా

పోటీలో 12 మంది అథ్లెట్లు

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

బెంగళూరు: భారత్‌లో తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ జావెలిన్‌ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. శనివారం బెంగళూరు వేదికగా ప్రతిష్ఠాత్మక ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ ఈవెంట్‌ జరగనుంది. భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన నీరజ్‌ చోప్రా పేరిట నిర్వహిస్తున్న ఈ టోర్నీలో 12 మంది జావెలిన్‌ త్రోయర్లు పాల్గొంటున్నారు. తన పేరిట జరుగుతున్న ఈ టోర్నీలో నీరజ్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇటీవల పారిస్‌ డైమండ్‌ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్‌ స్పైక్‌ టోర్నీల్లో టైటిల్స్‌ నెగ్గిన 27 ఏళ్ల నీరజ్‌ చోప్రా... హ్యాట్రిక్‌ టైటిల్‌పై గురిపెట్టాడు. 

2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో రజతంతో పాటు... ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్వర్ణాలు, డైమండ్‌ లీగ్‌ టైటిల్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు ఇలా అంతర్జాతీయ స్థాయిలో దాదాపు అన్నీ టోర్నీల్లో నీరజ్‌ సత్తా చాటాడు. ఇప్పుడు స్వదేశంలో నిర్వహిస్తున్న ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ ఈవెంట్‌లో కూడా అదే పరంపర కొనసాగించాలని భావిస్తున్నాడు. దేశంలో అథ్లెటిక్స్‌కు మరింత ఊతం ఇచ్చేందుకు ఈ టోర్నీ దోహదపడుతుందన్న నీరజ్‌... యువ అథ్లెట్లు దీని నుంచి స్ఫూర్తి పొందితే సంతోíÙస్తానని వెల్లడించాడు. 

ఈ ఏడాది తొలిసారి 90 మీటర్ల మార్క్‌ అందుకున్న నీరజ్‌... అదే ప్రదర్శన పునరావృతం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. మే నెలలో దోహా వేదికగా జరిగిన పోటీల్లో నీరజ్‌ తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకొని ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. భారత్‌లో నీరజ్‌ ఓ టోర్నీలో పాల్గొననుండటం ఏడాది విరామం తర్వాత ఇదే మొదటి సారి.  

భారత్‌లో ఇదే తొలిసారి.. 
భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య, ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో నీరజ్‌ చోప్రా పర్యవేక్షణలో ఈ ఈవెంట్‌ జరుగుతోంది. ప్రస్తుతానికి ఈ ఈవెంట్‌లో జావెలిన్‌ త్రో పోటీలు మాత్రమే జరుగుతుండగా... భవిష్యత్తులో దీన్ని మరింత విస్తృతం చేయాలని నీరజ్‌ భావిస్తున్నాడు. ప్రతి ఏటా దీన్ని నిర్వహించడంతో పాటు మరిన్ని క్రీడాంశాలను జతచేసే ఆలోచన ఉన్నట్లు వెల్లడించాడు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం మే 24న హర్యానాలోని పంచకులలో ఈ ఈవెంట్‌ నిర్వహించాలని నిర్ణయించగా... అంతర్జాతీయ ప్రసారదారుల విజ్ఞప్తి మేరకు దీన్ని బెంగళూరుకు మార్చారు. 

అనంతరం సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈవెంట్‌ తేదీ సైతం మారింది. ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య దీనికి ‘ఎ’ కేటగిరీ గుర్తింపునివ్వగా... భారత్‌లో జరుగుతున్న తొలి అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీ ఇదే కావడం విశేషం. అయితే ఈవెంట్‌ ప్రారంభానికి ముందే పలువురు స్టార్‌ అథ్లెట్లు వేర్వేరు కారణాల వల్ల టోర్నీ నుంచి వైదొలిగారు. గ్రెనడాకు చెందిన రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ గాయం కారణంగా పోటీలకు దూరం కాగా... భారత్‌కు చెందిన కిషోర్‌ జెనా సైతం గాయంతో టోర్నీకి దూరమయ్యాడు.  

వరల్డ్‌ అథ్లెటిక్స్‌కు సన్నాహకంగా 
ఈ ఏడాది సెప్టెంబర్‌లో టోక్యో వేదికగా ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌íÙప్‌ జరగనుండగా... దానికి ఇది సన్నాహకంగా ఉపయోగపడనుంది. మొత్తం 12 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటుండగా... అందులో ఐదుగురు త్రోయర్లు ఇప్పటికే వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అర్హత మార్క్‌ (85.50 మీటర్లు) అందుకున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఒలింపిక్‌ చాంపియన్‌ అర్షద్‌ నదీమ్‌ను కూడా ఈ ఈవెంట్‌కు ఆహ్వానించగా... అతడు వ్యక్తిగత శిక్షణకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో పాల్గొనబోవడం లేదని ప్రకటించాడు. 

ఆ తర్వాత ఇరు దేశల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ ఊసే లేకుండా పోయింది. 2016 రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ థామస్‌ రోలెర్‌ (జర్మనీ), ప్రపంచ మాజీ చాంపియన్‌ జూలియస్‌ యెగో (కెన్యా), కర్టిస్‌ థామ్సన్‌ (అమెరికా) నుంచి నీరజ్‌కు ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. 

అయితే యెగో, రోలెర్‌ ప్రస్తుతం ఫామ్‌లో లేరు. మార్టిన్‌ కొనెస్నీ (చెక్‌ రిపబ్లిక్‌), లూయిజ్‌ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్‌), రమేశ్‌ పతిరగే (శ్రీలంక), సిప్రియన్‌ మిర్జిగ్లాడ్‌ (పోలాండ్‌) సంచలనం నమోదు చేయాలని చూస్తున్నారు. భారత్‌ నుంచి నీరజ్‌ చోప్రాతో పాటు సచిన్‌ యాదవ్, యశ్‌వీర్‌ సింగ్, రోహిత్‌ యాదవ్, సాహిల్‌ సిల్వాల్‌ బరిలో దిగనున్నారు. ప్రస్తుతం దిగ్గజ కోచ్‌ జాన్‌ జెలెన్జీ వద్ద నీరజ్‌ శిక్షణ తీసుకుంటున్నాడు.  

ఇలాంటి టోర్నమెంట్‌ మనదేశంలో జరగాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నా. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది. కల నెరవేరినట్లు అనిపిస్తోంది. చాలా ఉత్సాహంగా ఉన్నా. ఒలింపిక్స్‌లో దేశం కోసం పతకాలు సాధించా. ఇప్పుడు దేశానికి తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. ఇది భారత యువ అథ్లెట్లకు, అభిమానులకు ఆనందం పంచుతుందనుకుంటున్నా. భారత అథ్లెటిక్స్‌లో నూతన అధ్యాయానికి ఇది నాంది. ఈ ఈవెంట్‌ ఇంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 

మనదేశంలో అంతర్జాతీయ పోటీలకు ఇది శుభారంభం. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో టోర్నీలు జరగాలి. జర్మనీలో వారానికి ఒకటి చొప్పున కేటగిరి ‘ఎ’, ‘బి’, ‘సి’పోటీలు జరుగుతుంటాయి. మనం కూడా ఆ స్థాయికి చేరాలి. అప్పుడు దేశంలో క్రీడా సంస్కృతి పెరుగుతుంది. మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా. అందుకోసం కఠోర సాధన చేస్తున్నా. ఈ పోటీల తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ కోసం ప్రాక్టీస్‌ ప్రారంభిస్తా. జావెలిన్‌ను విసిరే సమయంలో మరింత నియంత్రణ అవసరం. ప్రస్తుతం దానిపై దృష్టి పెట్టా.     –నీరజ్‌ చోప్రా

బరిలో ఉన్నది వీరే 
నీరజ్‌ చోప్రా (భారత్‌) 
సిప్రియన్‌ మిర్జిగ్లాడ్‌ (పోలాండ్‌) 
లూయిజ్‌ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్‌) 
థామస్‌ రోలెర్‌ (జర్మనీ) 
కర్టిన్స్‌ థామ్సన్‌ (అమెరికా) 
మార్టిన్న్‌ కొనెస్నీ (చెక్‌ రిపబ్లిక్‌) 
జూలియస్‌ యెగో (కెన్యా) 
రమేశ్‌ పతిరగే (శ్రీలంక) 
సచిన్‌ యాదవ్‌ (భారత్‌) 
రోహిత్‌ యాదవ్‌ (భారత్‌) 
సాహిల్‌ సిల్వాల్‌ (భారత్‌) 
యశ్‌ వీర్‌ సింగ్‌ (భారత్‌) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement