
న్యూఢిల్లీ: స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను... భారత వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా ఎన్నికైంది. 2020 టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం చేజిక్కించుకొని చరిత్ర సృష్టించిన చాను... సహచర లిఫ్టర్లకు తోడ్పాటు అందించేందుకు ఇది సహకరిస్తుందని పేర్కొంది.
‘తోటి లిఫ్టర్ల తరఫున మాట్లాడే అవకాశం దక్కంది. దీన్ని సద్వినియోగ పర్చుకుంటా. పదవితో వచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా.
క్రీడేతర అంశాలపై దృష్టి పడకుండా... వెయిట్లిఫ్టింగ్కు మరింత తోడ్పాటు అందించేందుకు నా వంతు కృషి చేస్తా. లిఫ్టర్ల సమస్యలతో పాటు అన్ని కోణాల్లో దృష్టి సారిస్తా’ అని మీరాబాయి చాను ఒక ప్రకటనలో తెలిపింది.
టోక్యో ఒలింపిక్స్లో చాను 49 కేజీల విభాగంలో రజతం గెలిచి... ఈ ఘనత సాధించిన తొలి భారత లిఫ్టర్గా నిలిచింది. అంతకుముందు (2000 సిడ్నీ ఒలింపిక్స్) భారత్ నుంచి వెయిట్లిఫ్టింగ్లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం నెగ్గింది.
అదే అనిశ్చితి: గందరగోళంలో భారత బాక్సింగ్ సంఘం
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సంఘం (బీఎఫ్ఐ)లో అనిశ్చితి కొనసాగుతోంది. రాష్ట్ర సంఘాలన్నీ వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తుంటే... తాజాగా ఎన్నికైన తాత్కాలిక కమిటీ మాత్రం జాతీయ చాంపియన్షిప్ల నిర్వహణ, కోచ్ల నియామకం, అంతర్జాతీయ టోర్నీలో ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా... న్యాయపరమైన సమస్యలతో ఆలస్యమైంది.
గత నెల 28న ఎన్నికలు నిర్వహించాలని మొదట నిర్ణయించగా... సమాయాభావం వల్ల అదీ సాధ్యపడలేదు. తాజాగా ఈ నెల 28 లోపు ఎన్నికలు నిర్వహించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. చాన్నాళ్లు బీఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్న అజయ్ సింగ్... తాత్కాలిక కమిటీకి కూడా చీఫ్గా కొనసాగుతున్నాడు.
‘సుదీర్ఘ అనుభవం ఉన్న అజయ్ సింగ్... ఎన్నికలను వాయిదా వేయడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు’ అని అస్సాం బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు, హేమంత్ అన్నారు. ‘అజయ్ సింగ్ నియంతలా వ్యవహరిస్తున్నారు. ఏడాది కాలంగా ఒక్క చాంపియన్షిప్ కూడా నిర్వహించలేదు. పారిస్ ఒలింపిక్స్లో మనవాళ్లకు రిక్తహస్తాలే మిగిలాయి’ అని మధ్యప్రదేశ్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు.