ఐపీఎల్-2026 సీజన్కు కోల్కతా నైట్రైడర్స్ స్పీడ్ స్టార్ ఆకాష్ దీప్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఆకాష్ దీప్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి సుమారు 8 నుంచి 12 వారాల సమయం పట్టనుంది. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని విదర్భ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సౌరభ్ దూబేతో కేకేఆర్ భర్తీ చేసింది.
ఐపీఎల్-2022లో దూబేను సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసినప్పటికి, గాయం కారణంగా అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. ఈ ఏడాది సీజన్ మినీ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నప్పటికి ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఆకాష్ దీప్ గాయం బారిన పడడంతో లక్కీగా ఐపీఎల్లో ఆడే అవకాశం దూబేకు దక్కింది.
ఈ విదర్భ పేసర్కు అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సత్తా అతడి ఉంది. అంతేకాకుండా బౌన్సీ పిచ్లపై బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడు. 2019 ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో భారత అండర్-23 జట్టు తరపున దూబే అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఒకే మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.
ఆ సమయంలో భారత అండర్-23 జట్టు కోచ్గా రాహుల్ ద్రవిడ్ ఉండడం విశేషం. ద్రవిడ్ వంటి దిగ్గజం నుంచి కూడా అతడు పాఠాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ వంటి మహా వేదికపై సత్తాచాటేందుకు సౌరభ్ సిద్దమయ్యాడు.
కాగా కేకేఆర్ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ దూరం కాగా.. శ్రీలంక స్పీడ్ స్టార్ మతీషా పతిరానా ఫిట్నెస్పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఐపీఎల్-19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: న్యూజిలాండ్ క్రికెట్కు భారీ షాక్..!


