టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో ఓటమి తర్వాత న్యూజిలాండ్ క్రికెట్లో లుకలుకలు బయటపడ్డాయి. కివీస్ క్రికెట్ బోర్డు సభ్యుడు, మాజీ క్రికెటర్ డైన్ వాష్ తన పదవికి రాజీనామా చేశారు. బోర్డు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల నేపథ్యంలో అతడు తన పదవి నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది.
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కొత్త ఫ్రాంచైజీ ఆధారిత టీ20 లీగ్ను ప్రారంభించాలని సోమవారం నిర్ణయించింది. అంతేకాకుండా బిగ్ బాష్ లీగ్లో న్యూజిలాండ్ ఆధారిత ఓ జట్టును చేర్చాలని బోర్డు ప్రతిపాదించింది. అయితే బోర్డు తీసుకున్న నిర్ణయం సభ్యుల మధ్య విభేదాలకు దారితీసింది.
ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే నాష్ తన పదవి నుంచి వైదొలగి అందరికి షాకిచ్చాడు. "బోర్డు తీసుకున్న నిర్ణయాలకు నేను మద్దతు ఇవ్వలేను. అందుకే నా పోస్ట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావించాను" అని నాష్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
మొన్న స్కాట్.. నేడు నాష్
కాగా ఇదే టీ20 లీగ్ వివాదం కారణంగా గత ఏడాది న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ కూడా పదవి నుంచి తప్పుకొన్నాడు. ఇప్పుడు నాష్ ఈ జాబితాలోకి చేరాడు. అయితే బోర్డు తీసుకున్న నిర్ణయానికి సోఫీ డివైన్, అమీలియా కేర్ వంటి స్టార్ ఉమెన్స్ క్రికెటర్లు మాత్రం మద్దతు తెలుపుతున్నారు.
కాగా భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోలిస్తే ఐసీసీ నుంచి న్యూజిలాండ్కు వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఈ లోటును పూడ్చుకోవడానికే కొత్త లీగ్ ప్రారంభించాలని న్యూజిలాండ్ క్రికెట్ యోచిస్తోంది.
చదవండి: ICC: పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు


