క్రిస్‌ గేల్‌ మెరుపులు | Kings Punjab Set Target Of 186 Runs Against Rajasthan | Sakshi
Sakshi News home page

క్రిస్‌ గేల్‌ మెరుపులు

Oct 30 2020 9:22 PM | Updated on Oct 30 2020 9:29 PM

Kings Punjab Set Target Of 186 Runs Against Rajasthan - Sakshi

అబుదాబి:  రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 186 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.  క్రిస్‌ గేల్‌ (99; 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌(46;41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించడంతో పాటు పూరన్‌(22; 10 బంతుల్లో 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించడంతో పంజాబ్‌ పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. రాజస్తాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో కింగ్స్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను రాహుల్‌, మన్‌దీప్‌ సింగ్‌లు ఆరంభించారు. కాగా,  ఆడిన తొలి బంతికి మన్‌దీప్‌ సింగ్‌ గోల్డెన్‌ డక్‌ అయ్యాడు.

ఆర్చర్‌ వేసిన తొలి ఓవర్‌ ఆఖరి బంతికి మన్‌దీప్‌.. స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను రాహుల్‌, గేల్‌లు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించడంతో కింగ్స్‌ గాడిలో పడింది. ఈ జోడి తమదైన శైలిలో రాజస్తాన్‌పై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ప్రధానంగా రాహుల్‌ ఔటైన తర్వాత గేల్‌ చెలరేగి ఆడాడు. పూరన్‌తో కలిసి 41 పరుగుల భాగస్వామ్యం, మ్యాక్స్‌వెల్‌తో కలిసి 22 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు గేల్‌. కాగా, సెంచరీ పరుగు దూరంలో గేల్‌ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. ఆర్చర్‌ వేసిన ఆఖరి ఓవర్‌ నాల్గో బంతి గేల్‌ బ్యాట్‌ను తాకి వికెట్ల గిరాటేయడంతో పెవిలియన్‌ చేరాడు. కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement