ఫైనల్లో 46 పరుగులతో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుపై జయభేరి
రాణించిన తేజల్, రాధ, ప్రేమ
బ్యాంకాక్: రాధ యాదవ్ సారథ్యంలోని భారత్ ‘ఎ’ మహిళల జట్టు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టి20 టోర్నీలోవిజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో భారత బ్యాటర్లకంటే బౌలర్లే సమష్టిగా కూల్చేసి ప్రత్యర్థిని చిత్తు చేశారు. దీంతో భారత్ ‘ఎ’ 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుపై ఘనవిజయం సాధించింది. టాస్ నెగ్గిన భారత అమ్మాయిలు ఫైనల్ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ముందుగా బ్యాటింగ్ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు సాధించారు. నిజానికి బ్యాటర్లంతా తడబడ్డారు.
ఓపెనర్లు నందిని కశ్యప్ (8), వృంద (19) సహా అనుష్క (8), మిన్ను మణి (0) ఇలా టాప్–4 బ్యాటర్లు 44 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తేజల్ హసబ్నిస్ (34 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగింది. కెపె్టన్ రాధా యాదవ్ (30 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఐదో వికెట్కు 69 పరుగులు జోడించి జట్టును ఆదుకుంది. భారత ఇన్నింగ్స్ను ఫాహిమా ఖాతూన్ (4/25) అద్భుతంగా కట్టడి చేసింది.
అయితే బంగ్లాకు నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యం కష్టమైంది కానేకాదు. కానీ భారత బౌలర్లు ప్రేమ రావత్ (3/12), తనూజ కన్వార్ (2/11), సోనియా (2/21), సైమా (1/11), రాధ (1/16), మిన్ను మణి (1/17) కలసికట్టుగా బంగ్లా భరతం పట్టారు. కనీసం ప్రత్యర్థి జట్టును వంద పరుగులైనా చేయనీకుండా చావుదెబ్బ కొట్టారు. దీంతో బంగ్లాదేశ్ ‘ఎ’ 19.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది.
ఓపెనర్ షమీమా సుల్తానా (20) చేసిన పరుగులే ఇన్నింగ్స్ టాప్స్కోరు! ఇంకో ముగ్గురు... షరి్మన్ సుల్తానా (18), కెప్టెన్ ఫాహిమా ఖాతూన్ (14), సాదియా (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్లకే అవుటయ్యారు.


