టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. ఈ మెగా టోర్నీలో బాగంగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ ఓటమికి బౌలర్ల కంటే బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని సూర్య చెప్పుకొచ్చా డు.
"మ్యాచ్ ఆరంభంలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 20 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును బ్యాక్ఫుట్లో ఉంచాం. కానీ ఆ తర్వాత వారు ఆడిన తీరు నిజంగా అద్బుతం. పవర్ప్లే ముగిసిన తర్వాత దాదాపు 15 ఓవర్లకు మాపై పైచేయి సాధించారు.
తర్వాత మళ్లీ వరుసగా వికెట్లు పడగొట్టి మేము తిరిగి గేమ్లోకి వచ్చాము. చివరి ఓవర్లో మళ్లీ పరుగులు వచ్చాయి. ఓవరాల్గా బౌలింగ్ పరంగా ఫర్వాదేన్పించాము. బుమ్రా, అర్ష్దీప్ జోడీ అద్బుతంగా బౌలింగ్ చేసింది. ఇద్దరూ కలిసి 5 వికెట్లు పడగొట్టారు.
అయితే బ్యాటింగ్ కాస్త మెరుగ్గా చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. 180 పరుగులు పైగా లక్ష్యాన్ని చేధిస్తున్నప్పుడు పవర్ప్లే అనేది చాలా ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తూ పవర్ప్లేలో మేము రాణించలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోవడంతో చిన్న చిన్న భాగస్వామ్యాలు కూడా నెలకొల్పలేకపోయాం.
కచ్చితంగా ఈ ఓటమిని నుంచి పాఠాలు నేర్చుకుంటాము. మళ్లీ బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం నాకుంది. చెన్నైలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగిస్తాము . సరైన ప్రణాళికతో బరిలోకి దిగి మళ్ళీ గెలుపు బాట పడతాము" అని పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో సూర్య పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. శివమ్ దూబే మినహా మిగితా ప్లేయర్లంతా ఘోరంగా విఫలమయ్యారు.


