
నేటి నుంచి ఇంగ్లండ్తో తొలి టెస్టు మ్యాచ్
ఆత్మవిశ్వాసంతో గిల్ బృందం
ప్రతీకారానికి ఇంగ్లండ్ సిద్ధం
మధ్యాహ్నం గం. 3:30 నుంచి సోనీ స్పోర్ట్స్ చానల్స్, సోనీ లైవ్లో ప్రత్యక్ష ప్రసారం
భారత టెస్టు క్రికెట్లో కొత్త అధ్యాయానికి తెర లేస్తోంది. సుదీర్ఘ కాలం జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అశ్విన్ల రిటైర్మెంట్ తర్వాత జట్టు తొలి సిరీస్ బరిలోకి దిగుతోంది. టెస్టు ఫార్మాట్లో కొత్త సారథిగా బాధ్యతలు తీసుకున్న శుబ్మన్ గిల్కు తొలి సిరీస్లో కఠిన పరీక్ష ఎదురవుతోంది.
ప్రత్యర్థి గడ్డపై ఇప్పటి వరకు మన రికార్డు, ప్రస్తుత యువ జట్టు అనుభవాన్ని చూస్తే ఇది పెద్ద సవాల్. టీమ్ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతో పాటు కెప్టెన్గా, బ్యాటర్గా గిల్ తనను తాను నిరూపించుకోవాల్సిన నేపథ్యంలో టెస్టు సిరీస్కు రంగం సిద్ధమైంది. అయితే గతంలోనూ పాత చరిత్రను మార్చిసంచలనాలు సృష్టించిన భారత బృందం మరోసారి అదే ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తే అనూహ్య ఫలితాలు ఖాయం.
లీడ్స్: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ పోరుకు సైరన్ మోగింది. ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’ సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య హెడింగ్లీ మైదానంలో నేటి నుంచి తొలి టెస్టు జరగనుంది. ఏడాది క్రితం భారత గడ్డపై జరిగిన టెస్టు పోరులో టీమిండియా 4–1తో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఇప్పుడు తమ సొంత మైదానంలో దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని స్టోక్స్ బృందం భావిస్తుండగా... అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కనబర్చి పైచేయి సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది.
టెస్టుల్లో భారత్కు 37వ కెప్టెన్గా గుర్తింపు పొందిన గిల్కు ఇది కీలక సిరీస్ కానుండగా... బ్యాటర్గా ఇంగ్లండ్ గడ్డపై పేలవ రికార్డు ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా గెలుపుపై గురి పెట్టాడు. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్కు స్వదేశంలో మంచి ఫలితాలు అందించిన ‘బజ్బాల్’ శైలి ఆట ఈసారి ఎలాంటి ఫలితాలు అందిస్తుందనేది ఆసక్తికరం.
ఆరో స్థానంలో ఎవరు?
తొలి టెస్టులో భారత తుది జట్టు దాదాపుగా ఖాయమైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆడనుండగా మూడో స్థానంలో కరుణ్ నాయర్ బరిలోకి దిగుతాడు. ఆస్ట్రేలియా సిరీస్లో ఆకట్టుకున్న జైస్వాల్తో పాటు రాహుల్ కూడా రాణిస్తే జట్టుకు శుభారంభం లభిస్తుంది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్న కరుణ్ నాయర్ తన ఇటీవలి దేశవాళీ ఫామ్ను కొనసాగించడంతో పాటు జట్టులో స్థానం కాపాడుకునే ఒత్తిడిని కూడా అధిగమించాల్సి ఉంటుంది.
నాలుగో స్థానంలో ఆడనున్న గిల్ తన బ్యాటింగ్తో అంచనాలు అందుకోవడం కీలకం. ఆసీస్ గడ్డపై విఫలమైన పంత్ మరింత బాధ్యతగా ఆడాల్సిన తరుణమిది. భారత జట్టు విజయావకాశాలు పేసర్ బుమ్రాపై ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. సొంత మైదానంలో అయినా సరే ఇంగ్లండ్ బ్యాటర్లు అతడిని సమర్థంగా ఎదుర్కోవడం అంత సులువు కాదు. సిరాజ్ కూడా స్వింగ్తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలడు. మూడో పేసర్గా ప్రసిధ్ కృష్ణ ఆడటం కూడా దాదాపు ఖాయమే.
ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ తన సత్తాను ఈ సిరీస్లో నిరూపించుకోవాల్సి ఉంది. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా స్థానానికి ఢోకా లేదు. అయితే మిగిలిన ఆరో స్థానం కోసమే జట్టులో గట్టి పోటీ ఉంది. ఇక్కడా రెగ్యులర్ బ్యాటర్ను ఆడిస్తారా లేక ఆల్రౌండర్కు అవకాశం ఇవ్వాలా అనే విషయంలో టీమ్ మేనేజ్మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బ్యాటర్ అయితే సాయి సుదర్శన్ అరంగేట్రం చేయవచ్చు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలంటే శార్దుల్ ఠాకూర్ లేదా నితీశ్ కుమార్ రెడ్డిలలో ఒకరికి చాన్స్ దక్కుతుంది. లేదా స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ రూపంలో ప్రత్యామ్నాయం ఉంది.
బౌలింగ్లో అనుభవలేమి...
దాదాపు రెండు దశాబ్దాల పాటు అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ బలంపైనే ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఆధారపడుతూ వచి్చంది. వీరిద్దరు కలిసి ప్రత్యర్థులను కుప్పకూలుస్తూ ఎన్నో విజయాలు అందించారు. అయితే ఇప్పటి పేస్ బృందానికి చాలా తక్కువ అనుభవం ఉంది. ఈ బౌలింగ్ దళం ప్రత్యర్థిని ఏమాత్రం భయపెట్టించేలా లేదు. కార్స్ 5, టంగ్ 3 టెస్టులు ఆడగా...అనుభవజ్ఞుడే అయినా అండర్సన్, బ్రాడ్లతో పోలిస్తే క్రిస్ వోక్స్ స్థాయి తక్కువ. భారత బ్యాటర్ల కోణంలో చూస్తే స్పిన్నర్ బషీర్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. అందుకే ఇంగ్లండ్ ఈ సిరీస్లో తమ బ్యాటింగ్నే నమ్ముకుంది.

13 వేలకు పైగా టెస్టు పరుగులు సాధించిన రూట్ మరోసారి బ్యాటింగ్ బాధ్యత మోస్తున్నాడు. అద్భుత ఫామ్లో ఉన్న అతడు భారత బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడనేది కీలకం. ‘బజ్బాల్’ వచ్చాక ఎన్నో శుభారంభాలు అందించిన క్రాలీ, డకెట్ నుంచి మరో సారి జట్టు అదే ఆటను ఆశిస్తోంది. పోప్తో పాటు ప్రతిభావంతుడైన బ్రూక్పై జట్టు బ్యాటింగ్ భారం ఉంది. కెప్టెన్ స్టోక్స్ బ్యాటింగ్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. గత మూడేళ్లుగా అతను సెంచరీనే చేయలేదు. భారత గడ్డపై ఆడిన ఐదు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమైన స్టోక్స్ ఎలాంటి ప్రభావం చూపించగలడనేది కీలకం.
3 ఇంగ్లండ్ గడ్డపై భారత్ 19 టెస్టు సిరీస్లు ఆడింది. ఇందులో 3 సిరీస్లను (1971లో, 1986లో, 2007లో) సొంతం చేసుకుంది. 14 సిరీస్లను చేజార్చుకుంది. మరో 2 సిరీస్లు ‘డ్రా’గా ముగిశాయి.
67 ఇప్పటి వరకు ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ జట్టుతో భారత్ 67 టెస్టులు ఆడింది. 9 టెస్టుల్లో గెలిచిన భారత్ 36 టెస్టుల్లో ఓడిపోయింది. మరో 22 టెస్టులను టీమిండియా ‘డ్రా’ చేసుకుంది.
7 హెడింగ్లీ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొత్తం 7 టెస్టులు జరిగాయి. 2 టెస్టుల్లో భారత్, 4 టెస్టుల్లో ఇంగ్లండ్ గెలుపొందాయి. 1 టెస్టు ‘డ్రా’గా ముగిసింది.
పిచ్, వాతావరణం
హెడింగ్లీ మైదానంలో తొలిసారి ఆరంభంలో పేసర్లకు కాస్త అవకాశం ఉన్నా ఆట సాగిన కొద్దీ బ్యాటింగ్కు అనుకూలం కావొచ్చు. ఇంగ్లండ్ కూడా పూర్తిగా బౌలింగ్ పిచ్ను ఎంచుకునే సాహసం చేయడం లేదు. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వర్ష సూచన లేదు.
తుది జట్లు
ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్, వోక్స్, కార్స్, టంగ్, బషీర్.
భారత్ (అంచనా): గిల్(కెప్టెన్), జైస్వాల్, రాహుల్, కరుణ్ నాయర్, పంత్, సుదర్శన్/నితీశ్ రెడ్డి, జడేజా, బుమ్రా, సిరాజ్, ప్రసిధ్, కుల్దీప్.