
ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న రెండో నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత ఏ జట్టుకు 21 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్కు 327 పరుగుల వద్ద తెరపడింది.
ఖలీల్ అహ్మద్ (19-1-70-4), అన్షుల్ కంబోజ్ (18-3-56-2), తుషార్ దేశ్పాండే (14-1-62-2), తనుశ్ కోటియన్ (11-2-25-1), నితీశ్ కుమార్ రెడ్డి (12-2-49-1) చెలరేగడంతో లయన్స్ భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్ను దాటలేకపోయింది.
192/3 స్కోర్ వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన లయన్స్ టీ విరామం లోపే మిగతా 7 వికెట్లు కోల్పోయింది. ఇవాళ ఆటలో ఖలీల్ అహ్మద్ నిప్పులు చెరిగాడు. ఇవాళ లయన్స్ కోల్పోయిన 7 వికెట్లలో ఖలీల్ ఒక్కడే 4 వికెట్లు తీశాడు. లయన్స్ చివరి ముగ్గురు ఆటగాళ్లు ఫర్హాన్ అహ్మద్ (24), జోష్ టంగ్ (36 నాటౌట్), ఎడ్వర్డ్ జాక్ (16) ప్రతిఘటించడంతో లయన్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
లయన్స్ ఇన్నింగ్స్లో టామ్ హెయిన్స్ 54, ఎమిలియో గే 71 అర్ద సెంచరీలతో రాణించగా.. జోర్డర్ కాక్స్ 45, బెన్ మెక్కిన్నీ 12, జేమ్స్ ర్యూ 10, జార్జ్ హిల్ 0, క్రిస్ వోక్స్ 5, మ్యాక్స్ హోల్డన్ 7 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (116) అద్భుతమైన శతకంతో భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ధృవ్ జురెల్ (52), కరుణ్ నాయర్ (40), నితీశ్ కుమార్ రెడ్డి (34) రాణించారు. యశస్వి జైస్వాల్ (17), అభిమన్యు ఈశ్వరన్ (11), శార్దూల్ ఠాకూర్ (19), తనుశ్ కోటియన్ (15), అన్షుల్ కంబోజ్ (2), తుషార్ దేశ్పాండే (11) తక్కువ స్కోర్కు ఔటయ్యారు.