
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వికెట్లు కోల్పోయినప్పటికీ వీరోచితంగా పోరాడింది.
తొలుత కేఎల్ రాహుల్ (90), శుభ్మన్ గిల్ (103) అద్భుతంగా బ్యాటింగ్ చేసి మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించగా.. ఆతర్వాత వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచిత శతకాలు బాది మ్యాచ్ను డ్రా చేశారు. సుందర్-జడేజా జోడీ ఐదో వికెట్కు అజేయమైన 203 పరుగులు జోడించింది. ఫలితంగా భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది.
అంతకుముందు ఇంగ్లండ్తో తొలి ఇన్నింగ్స్లో 669 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (150), బెన్ స్టోక్స్ (141) భారీ శతకాలతో కదంతొక్కగా.. జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, బుమ్రా, సుందర్ తలో 2, అన్షుల్ కంబోజ్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీశాడు.
నాలుగో టెస్ట్ డ్రా కావడంతో సిరీస్లో ఇంగ్లండ్ ఆధిపత్యం 2-1తో కొనసాగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జులై 31 నుంచి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో ఒకటి, మూడు మ్యాచ్లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్లో విజయం సాధించింది.