IND VS ENG 1st Test: రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన పంత్‌.. అయితే ఈసారి..! | IND VS ENG 1st Test: Rishabh Pant Made Century In Second Innings Too | Sakshi
Sakshi News home page

IND VS ENG 1st Test: రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన పంత్‌.. అయితే ఈసారి..!

Jun 23 2025 7:50 PM | Updated on Jun 23 2025 8:09 PM

IND VS ENG 1st Test: Rishabh Pant Made Century In Second Innings Too

లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 130 బంతుల్లో 13 ​ ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

అయితే ఈ సారి పంత్‌ సెంచరీ చేసిన తర్వాత పల్టీ సెలబ్రేషన్స్‌ చేసుకోలేదు. స్టాండ్స్‌ నుంచి గవాస్కర్‌ పల్టీ కొట్టాలని అడిగినా పంత్‌ పెద్దగా పట్టించుకోలేదు. డబుల్‌ సెంచరీ తర్వాత అన్నట్లు సైగలు చేశాడు. 

తాజా సెంచరీతో టెస్ట్‌ల్లో పంత్‌ సెంచరీల సంఖ్య 8కి చేరింది. మరో ఎండ్‌లో కేఎల్‌ రాహుల్‌ కూడా సెంచరీ పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులకు ఔటైన రాహుల్‌.. ఈసారి మరింత బాధ్యతాయుతంగా ఆడి కెరీర్‌లో తొమ్మిదో సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్‌ 202 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును అందుకున్నాడు.

నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే శుభ్‌మన్‌ గిల్‌ (8) వికెట్‌ కోల్పోయిన భారత్‌ను రాహుల్‌-పంత్‌ జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరు ఎంతో సంయమనంతో బ్యాటింగ్‌ చేస్తూ.. భారత్‌ పైచేయి సాధించే దిశగా తీసుకెళ్తున్నారు. ఈ జోడీ ఇప్పటికే నాలుగో వికెట్‌కు 172 పరుగులు జోడించింది. 

పంత్‌ సెంచరీ పూర్తయ్యే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ స్కోర్‌ 264/3గా ఉంది. రాహుల్‌ 112, పంత్‌ 100 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్‌ ఆధిక్యం 270 పరుగులుగా ఉంది. భారత రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ 4, సాయి సుదర్శన్‌ 30, గిల్‌ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ 2, స్టోక్స్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

అంతకుముందు భారత్‌, ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ల్లో నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్‌ చేశాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (101), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (147), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్‌ బషీర్‌, బ్రైడన్‌ కార్స్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్‌ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్‌ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్‌ 40, క్రిస్ వోక్స్‌ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. 

ఫలితంగా ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్‌ కృష్ణ మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement