
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా ఇవాల్టి నుంచి (జూన్ 20) తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో (2025-27) ఇరు జట్లకు మొదటిది. భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి పోట్టి క్రికెట్కే అలవాటు పడిన ఫ్యాన్స్, ఈ మ్యాచ్ నుంచి సుదీర్ఘ ఫార్మాట్లోని అసలు సిసలైన మజాను ఎంజాయ్ చేస్తారు.
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కూడా సంసిద్దంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగి సత్తా చాటుదామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టార్ త్రయం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత శుభ్మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా సరికొత్త శకంలోకి అడుగుపెట్టబోతుంది. మరోవైపు ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ సారథ్యంలో యువకులు, అనుభవజ్ఞులతో ఉరకలేస్తుంది. ఇంగ్లీష్ జట్టు తమ బజ్బాల్ అటాకింగ్ గేమ్ను టీమిండియాపై ప్రయోగించాలని ఆరాట పడుతుంది.
ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించగా.. భారత్ తమ కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. మ్యాచ్కు చాలా సమయం ముందుగానే జట్టును ప్రకటించి తమ ప్రణాళికలను బహిర్గతం చేయకూడదనే భారత మేనేజ్మెంట్ ఉద్దేశం.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్కు ముందు ఓ ఆసక్తికర విషయం సోషల్మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటంటే.. టీమిండియా ఆటగాళ్ల మొత్తం టెస్ట్ సెంచరీల సంఖ్య కన్నా, ఒక్క ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ టెస్ట్ సెంచరీల సంఖ్యనే అధికంగా ఉండటం. రూట్ తన టెస్ట్ కెరీర్లో 36 సెంచరీలు బాదగా.. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు సభ్యులంతా కలిపి 29 సెంచరీలే చేశారు.
వీరిలో కేఎల్ రాహుల్ అధికంగా 8 సెంచరీలు చేయగా.. వైస్ కెప్టెన్ పంత్ 6, కెప్టెన్ గిల్ 5, యశస్వి జైస్వాల్ 4, రవీంద్ర జడేజా 4, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి తలో సెంచరీ చేశారు. అంటే, రూట్ సెంచరీల కంటే టీమిండియా ఆటగాళ్లందరూ కలిపి చేసిన సెంచరీలు ఇంకా 7 తక్కువ అన్నమాట.
రూట్ మరో 373 పరుగులు చేస్తే..
భారత్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రూట్ మరో 373 పరుగులు చేస్తే, టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి దూసుకొస్తాడు. ప్రస్తుతం 13006 పరుగులు ఖాతాలో కలిగి ఉన్న రూట్.. మరో 373 పరుగులు చేస్తే, రాహుల్ ద్రవిడ్ (13288), జాక్ కల్లిస్ (13289), రికీ పాంటింగ్ను (13378) అధిగమిస్తాడు. అప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక్కడే (15921) రూట్ కంటే ముందుంటాడు.
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుది జట్టు (అంచనా)..
యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్ సింగ్
టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.