
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో భారత స్టార్ గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి టైటిల్కు చేరువైంది. అలీనా కష్లిన్స్కాయ (పోలాండ్)తో మంగళవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్ను హంపి 61 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మరోవైపు చైనా గ్రాండ్మాస్టర్ జు జినెర్ 50 ఎత్తుల్లో భారత్కే చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ను ఓడించింది. ఎనిమిదో రౌండ్ తర్వాత హంపి, జు జినెర్ ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.
అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరులో జు జినెర్పై హంపి పైచేయిగా ఉంది. నేడు జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్లో నుర్గుల్ సలీమోవా (బల్గేరియా)తో హంపి; పొలీనా షువలోవా (రష్యా)తో జు జినెర్ తలపడతారు. భారత ఇతర గ్రాండ్మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్బాబు తమ ఎనిమిదో రౌండ్ గేమ్లను ‘డ్రా’ చేసుకున్నారు. మెలియా సలోమి (జార్జియా)తో గేమ్ను హారిక 116 ఎత్తుల్లో... సలీమోవాతో గేమ్ను వైశాలి 47 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు.
బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా), పొలీనా షువలోవా మధ్య జరిగిన మరో గేమ్ 91 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. ఎనిమిదో రౌండ్ తర్వాత దివ్య దేశ్ముఖ్ ఐదు పాయింట్లతో మూడో స్థానంలో, నాలుగు పాయింట్లతో హారిక ఐదో స్థానంలో, 3.5 పాయింట్లతో వైశాలి ఆరో స్థానంలో ఉన్నారు.