ప్రపంచ చాంపియన్‌షిప్‌ లక్ష్యం | The goal is the World Championship says Neeraj Chopra | Sakshi
Sakshi News home page

ప్రపంచ చాంపియన్‌షిప్‌ లక్ష్యం

Sep 28 2024 4:21 AM | Updated on Sep 28 2024 4:21 AM

The goal is the World Championship says Neeraj Chopra

గాయం నుంచి కోలుకున్నా 

జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా వ్యాఖ్య  

సొనెపట్‌: కొత్త సీజన్‌ను వంద శాతం ఫిట్‌నెస్‌తో ప్రారంభిస్తానని భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా అన్నాడు. రెండు వరుస ఒలింపిక్స్‌లలో స్వర్ణ, రజత పతకాల విజేత అయిన 26 ఏళ్ల ఈ స్టార్‌ గాయం నుంచి కోలుకున్నట్లు చెప్పాడు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో టాప్‌–3లో నిలవడమే లక్ష్యంగా శ్రమిస్తానని పేర్కొన్నాడు. బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్‌ లీగ్‌ ఫైనల్లో చోప్రా రెండో స్థానంలో నిలిచి సీజన్‌ను ఘనంగా ముగించాడు. 

హరియాణాలోని స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో నిర్వహించిన ‘మిషన్‌ ఒలింపిక్స్‌–2036’ పాల్గొన్న నీరజ్‌ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పటిదాకా జరిగిన సీజన్‌ ముగిసింది. కొత్త సీజన్‌పై దృష్టి పెట్టాలి. ఇందులో పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. 2025లో టోక్యోలో జరిగే ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో పతకమే లక్ష్యంగా సన్నాహాలు ప్రారంభించాల్సి ఉంది. ఒలింపిక్స్‌ అనేది ఎప్పటికైనా పెద్ద ఈవెంటే. కానీ దానికి ఇంకా నాలుగేళ్ల సమయముంది’ అని అన్నాడు. ఈ ఏడాది గాయంతో ఇబ్బంది పడిన తను ప్రస్తుతం కోలుకున్నానని చెప్పాడు. 

పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో కొత్త సీజన్‌ బరిలోకి దిగుతానన్నాడు. సాంకేతిక అంశాలపై కూడా దృష్టి సారించినట్లు చెప్పిన చోప్రా జర్మన్‌ బయోమెకానిక్‌ నిపుణుడైన క్లాస్‌ బార్టొనిజ్‌తో కలిసి పురోగతి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పాడు. స్వదేశంలోనూ శిక్షణ తీసుకోవచ్చని అయితే పోటీలు విదేశాల్లో ఉండటంతో అక్కడే ట్రెయినింగ్‌లో పాల్గొంటున్నానని వివరించాడు. 

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో వరుస ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకాలు గెలిచిన భారత తొలి అథ్లెట్‌గా ఘనతకెక్కిన చోప్రా ఒలింపిక్స్‌లో ఆరు పతకాలే సాధించినా... ఎక్కువగా నాలుగో స్థానాలు వచ్చాయన్న సంగతిని గుర్తు చేశాడు. దీంతో ఒక్క స్వర్ణం లేకపోయినా మన ప్రదర్శన తీసికట్టుగా భావించాల్సిన అవసరం లేదన్నాడు. 

అయితే పారాలింపిక్స్‌లో మన పారా అథ్లెట్లు అసాధారణ స్థాయిలో పతకాలు సాధించారని అభినందించాడు. తదుపరి మెగా ఈవెంట్లలో భారత్‌ బలమైన జట్టుగా బరిలోకి దిగుతుందని, మరిన్ని పతకాలు సాధిస్తుందని చెప్పాడు. అంతకుముందు కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో నీరజ్‌ భేటీ అయ్యాడు. తాను సంతకం చేసిన జెర్సీని మంత్రికి నీరజ్‌ అందజేశాడు.   

Advertisement
 
Advertisement
Advertisement