WC: జట్టు ఎంపిక అద్భుతం.. గెలిచినా.. ఓడినా! వెళ్లండి.. వెళ్లి! ఓవరాక్షన్‌ వద్దు.. | Sakshi
Sakshi News home page

WC 2023: జట్టు ఎంపిక అద్భుతం.. గెలిచినా.. ఓడినా! వెళ్లండి.. వెళ్లి! ఓవరాక్షన్‌ వద్దు..

Published Tue, Sep 5 2023 6:37 PM

Get Out There Kick Some: Ravi Shastri Reacts To India WC 2023 Squad - Sakshi

India’s 15-member squad for 2023 ODI World Cup: వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ప్రకటించిన జట్టుపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. సెలక్టర్ల ఎంపిక అద్భుతంగా ఉందంటూ కొనియాడాడు. కాగా ఆసియా కప్‌-2023 ముగిసిన తర్వాత మరో మెగా క్రికెట్‌ ఈవెంట్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

భారత్‌ వేదికగా అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్‌ జరుగనుంది. ఈ క్రమంలో బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఏడుగురు బ్యాటర్లతో పాటు నలుగురు బౌలర్లు, నలుగురు ఆల్‌రౌండర్లకు ఇందులో స్థానం కల్పించింది.

అప్పుడు చోటు లేదు.. ఈసారి కెప్టెన్‌గా..
ఇక సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌-2011లో జట్టులో చోటు కూడా దక్కని రోహిత్‌ శర్మ ఈసారి ఏకంగా కెప్టెన్‌గా బరిలోకి దిగనుండగా.. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. ఆసియా వన్డే టోర్నీ జట్టులో ఉన్న తిలక్‌ వర్మ, ప్రసిద్‌ కృష్ణలకు తప్ప ప్రధాన జట్టులోని మిగతా 15 మంది ఐసీసీ ఈవెంట్‌ ఆడనున్నారు.

అతడు ఎందుకు?
ఈ నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌.. కొత్తగా ఇషాన్‌ కిషన్‌ కూడా మిడిలార్డర్‌లో రాణిస్తుండగా.. వన్డేల్లో మెరుగైన రికార్డులేని సూర్యకుమార్‌ యాదవ్‌ ఎంపిక విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే విధంగా మణికట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ను విస్మరించడం కూడా హర్భజన్‌ సింగ్‌ వంటి మాజీ క్రికెటర్లకు అసహనం తెప్పిస్తోంది.

అద్భుతమైన ఎంపిక
ఈ క్రమంలో 1983 విజేత, మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి మాత్రం భిన్నంగా స్పందించాడు. జట్టు ఎంపిక సూపర్‌ అంటూ సెలక్టర్లను ఆకాశానికెత్తాడు. ఈ మేరకు.. ‘‘అద్భుతమైన టీమ్‌ను ఎంపిక చేశారు. వెళ్లండి... ప్రత్యర్థి జట్లను మట్టికరిపించండి. ఏదేమైనా.. గెలిచినా.. ఓడినా.. అనుభవం గడించడంలో ఇదంతా భాగమే. 

ఆటను పూర్తిగా ఆస్వాదించండి. మనసులు గెలుచుకోండి. దేశానికి గర్వకారణం కండి’’ అంటూ ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చాడు. ఇందుకు స్పందనగా.. ‘ఓవరాక్షన్‌ వద్దు రవిభాయ్‌.. ఈ జట్టుతో వరల్డ్‌కప్‌ గెలవడం కాదు కదా.. సెమీస్‌ చేరడం కూడా కష్టమే’’ అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా ఉన్నపుడు
కాగా వరల్డ్‌కప్‌-2019 సమయంలో రవిశాస్త్రి మార్గదర్శనంలో విరాట్‌ కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ వేదికగా రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. నాడు కివీస్‌తో.. ఫైనల్లో బెన్‌స్టోక్స్‌ అద్బుత ఇన్నింగ్స్‌ కారణంగా ఇంగ్లండ్‌ తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. 

చదవండి: వన్డే వరల్డ్‌కప్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టు నిండా చిచ్చరపిడుగులు

Advertisement
Advertisement