వన్డే వరల్డ్‌కప్‌ ఫిక్చర్స్‌ విడుదల.. భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే..? | Fixtures Of Women's ODI WORLD CUP 2025 Released | Sakshi
Sakshi News home page

వన్డే వరల్డ్‌కప్‌ ఫిక్చర్స్‌ విడుదల.. భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే..?

Jun 16 2025 4:07 PM | Updated on Jun 16 2025 4:30 PM

Fixtures Of Women's ODI WORLD CUP 2025 Released

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఫిక్చర్స్‌ను ఐసీసీ ఇవాళ (జూన్‌ 16) విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది సెప్టెంబర్‌ 30-నవంబర్‌ 2 మధ్యలో భారత్‌, శ్రీలంక వేదికగా జరుగనుంది. ఈ టోర్నీ హైబ్రిడ్‌ మోడల్‌లో జరుగనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌, శ్రీలంక ఆడే మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. భారత్‌-శ్రీలంక మ్యాచ్‌ మాత్రం భారత్‌లోనే జరుగనుంది.

టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో (సెప్టెంబర్‌ 30) టీమిండియా శ్రీలంకతో బెంగళూరు వేదికగా తలపడనుంది. అక్టోబర్‌ 29న తొలి సెమీఫైనల్‌ (గౌహతి లేదా కొలొంబో (పాక్‌ క్వాలిఫై అయితే)), 30న రెండో సెమీఫైనల్‌ (బెంగళూరు) జరుగనున్నాయి. నవంబర్‌ 2న ఫైనల్‌ (బెంగళూరు లేదా కొలొంబో) జరుగుతుంది. మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 12 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగుతుంది.

భారత్‌లోని చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గౌహతి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ-వీడిసీఏ స్టేడియంలో (విశాఖపట్నం) మ్యాచ్‌లు జరుగుతాయి. శ్రీలంకలో ప్రేమదాస స్టేడియంలో (కొలంబో) మ్యాచ్‌లు జరుగుతాయి.

ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు (భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్) పాల్గొంటాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతుంది. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను ఓడించి ఏడోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు ఆస్ట్రేలియానే.

పాకిస్తాన్‌ మ్యాచ్‌లు కొలొంబోలో ఎందుకు..?
ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు కొలొంబోలోని ప్రేమదాస​ స్టేడియంలో జరుగనున్నాయి. పురుషుల ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌ భారత్‌లో పర్యటించదు. ఆ టోర్నీ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టలేదు.

భారత్‌ ఆడాల్సిన మ్యాచ్‌లు హైబ్రిడ్‌ పద్దతి ప్రకారం దుబాయ్‌లో జరిగాయి. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్‌ కూడా భారత్‌లో ఆడదని అప్పుడే ఒప్పందం చేసుకున్నారు.

భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే..?
ఈ మెగా టోర్నీలో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 5న కొలొంబోలో జరుగనుంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్‌ దశతో భారత్‌ మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడనుంది. దాని షెడ్యూల్‌ కింది విధంగా ఉంది.

మంగళవారం, సెప్టెంబర్ 30—భారత్‌ vs శ్రీలంక—బెంగళూరు—మధ్యాహ్నం 3

ఆదివారం, అక్టోబర్ 5—భారత్‌ vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3

గురువారం, అక్టోబర్ 9—భారత్‌ vs దక్షిణాఫ్రికా—వైజాగ్—మధ్యాహ్నం 3

ఆదివారం, అక్టోబర్ 19—భారత్‌ vs ఇంగ్లాండ్—ఇండోర్—మధ్యాహ్నం 3

గురువారం, అక్టోబర్ 23—భారత్‌ vs న్యూజిలాండ్—గౌహతి—మధ్యాహ్నం 3

ఆదివారం, అక్టోబర్ 26—భారత్‌ vs బంగ్లాదేశ్—బెంగళూరు—మధ్యాహ్నం 3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement