పోరాడి ఓడిన మానస్, కరణ్‌.. | Dhamne and Karan Singh exit despite in Bengaluru Open 2025 | Sakshi
Sakshi News home page

Bengaluru Open: పోరాడి ఓడిన మానస్, కరణ్‌..

Feb 26 2025 9:25 AM | Updated on Feb 26 2025 12:00 PM

Dhamne and Karan Singh exit despite in Bengaluru Open 2025

బెంగళూరు: ‘వైల్డ్‌ కార్డు’తో బరిలోకి దిగిన మానస్‌ ధామ్నె, రామ్‌కుమార్‌ రామనాథన్‌... ‘క్వాలిఫ యర్‌’ హోదాలో అడుగు పెట్టిన కరణ్‌ సింగ్‌... బెంగళూరు ఓపెన్‌ ఏటీపీ–125 చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో తొలి రౌండ్‌ను దాటలేకపోయారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో మానస్‌ ధామ్నె 3–6, 6–3, 6–7 (3/7)తో పీటర్‌ బార్‌ బిర్యుకోవ్‌ (రష్యా) చేతిలో... కరణ్‌ సింగ్‌ 4–6, 6–4, 6–7 (3/7)తో జురిజ్‌ రొడియోనోవ్‌ (ఆ్రస్టియా) చేతిలో... రామ్‌కుమార్‌ రామనాథన్‌ 6–7 (3/7), 5–7తో షింటారో మొచిజుకి (జపాన్‌) చేతిలో పోరాడి ఓడిపోయారు.

బిర్యుకోవ్‌తో 1 గంట 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల మానస్‌ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. అయితే టైబ్రేక్‌లో మానస్‌ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. రొడియోనోవ్‌తో 1 గంట 57 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కరణ్‌ 11 ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. నిర్ణాయక టైబ్రేక్‌లో కరణ్‌ ఒత్తిడికి లోనై ఓటమి పాలయ్యాడు. షింటారోతో 1 గంట 48 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రామ్‌ 14 ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు.    

Advertisement
 
Advertisement
Advertisement