రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు | Dedicate the award to Gujarat Education minister: Ravindra Jadeja | Sakshi
Sakshi News home page

ఈ అవార్డు గుజరాత్‌ మంత్రికి అంకితం: రవీంద్ర జడేజా

Apr 23 2026 3:33 PM | Updated on Apr 23 2026 6:36 PM

Dedicate the award to Gujarat Education minister: Ravindra Jadeja

ఐపీఎల్‌-2026లో రాజస్తాన్ రాయల్స్‌ తరపున తొలిసారి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు రవీంద్ర జడేజా. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొట్టాడు జడ్డూ.

కఠినమైన లక్నో పిచ్‌పై 29 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 43 పరుగులతో అజేయంగా నిలిచిన జడ్డూ.. రాయల్స్‌ తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌. ఇక బౌలింగ్‌ పరంగానూ ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రాణించాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 29 పరుగులు మాత్రమే ఇచ్చి.. నికోలస్‌ పూరన్‌ రూపంలో కీలక వికెట్‌ పడగొట్టాడు.

రెండేళ్లలో తొలిసారి
ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ 159 పరుగులే స్కోరు చేసినప్పటికీ.. బౌలర్ల విజృంభణ కారణంగా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఇందులో జడ్డూ కీలక పాత్ర పోషించి.. గత రెండేళ్లలో తొలిసారి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

రివాబాకు అంకితం
ఈ సందర్భంగా రవీంద్ర జడేజా తన భార్య రివాబాపై ప్రేమ కురిపించాడు. అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. ‘‘జట్టు విజయం కోసం కృషి చేసి అవార్డు అందుకున్న అనుభూతి చాలా బాగుంది. ఈ అవార్డును గుజరాత్‌ విద్యాశాఖా మంత్రికి అంటే నా భార్య రివాబాకు అంకితం చేస్తున్నా.

మ్యాచ్‌ ఆరంభానికి ముందే.. నేను ఈరోజు అద్భుతం చేయగలగనని ఆమె చెప్పింది. ఆ మాటలే నిజమయ్యాయి. ఇందుకు ఆమెకు కృతజ్ఞతలు. నిజానికి ఈ వికెట్‌ చాలా కఠినంగా ఉంది.

చివరి ఓవర్లోనూ..
బంతి బాగా స్వింగ్‌ అయింది. వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని భావించాను. అందుకు తగ్గట్లే ఆడాను. టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. చివరి ఓవర్లోనూ మేము పరుగులు రాబట్టగలిగాము’’ అని జడేజా పేర్కొన్నాడు. కాగా లక్నోతో చివరి ఓవర్లో రాజస్తాన్‌ 20 పరుగులు రాబట్టింది.

మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన రాజస్తాన్‌.. లక్నోను 119 పరుగులకే ఆలౌట్‌ చేసింది. తద్వారా 40 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకువచ్చింది. కాగా ఈ సీజన్‌లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాజస్తాన్‌కు ఇది ఐదో గెలుపు. 

చదవండి: సీఎస్‌కే శిబిరంలో తీవ్ర విషాదం​

Advertisement
 
Advertisement
Advertisement