ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్కు కష్టకాలం కొనసాగుతోంది. గాయాలు, ఫామ్ సమస్యలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ఆ జట్టుకు.. తాజాగా మరో సాడ్ న్యూస్ తెలిసింది. జట్టు పేసర్ ముకేశ్ చౌదరి తన తల్లిని కోల్పోయాడు. ఆతడి తల్లి ప్రేమ్ దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఈ వార్తతో సీఎస్కే శిబిరం విషాదంలో మునిగిపోయింది. జట్టు యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా ముకేశ్ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేసింది. కష్ట సమయంలో ముకేశ్తో ఉన్నామని భరోసా ఇచ్చింది.
The CSK family mourns the passing of Mukesh Choudhary’s mother.
We stand with Mukesh and his family, keeping them in our thoughts and prayers during this incredibly difficult time.— Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2026
మ్యాచ్కు దూరం కానున్న ముకేశ్
తల్లి అంత్యక్రియల కోసం ముకేశ్ తన స్వస్థలానికి వెళ్లడంతో, ముంబై ఇండియన్స్తో ఇవాళ (ఏప్రిల్ 23) జరగనున్న కీలక మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇప్పటికే గాయాల కారణంగా బలహీనపడిన సీఎస్కే బౌలింగ్ విభాగానికి ఇది మరో భారీ దెబ్బగా మారింది.
ఈ సీజన్ ప్రారంభం నుంచే సీఎస్కేను సమస్యలు వెంటాడుతున్నాయి. ధోని ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. బ్రెవిస్ ఆరంభంలో పలు మ్యాచ్లు మిస్ అయ్యాడు. మంచి టచ్లో ఉన్న ఆయుశ్ మాత్రే, ఖలీల్ అహ్మద్ గాయాల కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యారు.
ఖలీల్ స్థానాన్ని గత మ్యాచ్లో భర్తీ చేసిన ముకేశ్ కూడా ఇప్పుడు వ్యక్తిగత కారణంగా జట్టుకు దూరం కావడంతో సీఎస్కే బౌలింగ్ కూర్పులో మార్పులు అనివార్యమయ్యాయి. మ్యాట్ హెన్రీని జట్టులోకి తీసుకుంటే విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్లో మార్పులు చేయాల్సి ఉంటుంది.
టోర్నీ కీలక దశలో సీఎస్కేకు ఈ పరిస్థితి రావడం, ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను భారీగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ఆ జట్టు ఆడిన 6 మ్యాచ్ల్లో రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ఈ దశలో ఉన్నపాటి అడపాదడపా వనరులు కూడా దూరం కావడంతో సీఎస్కే పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


