Cheteshwar Pujara: కౌంటీ క్రికెట్లో దుమ్మురేపుతున్న పుజారా.. వరుసగా మూడో శతకం
టీమిండియా సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా కౌంటీలో వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. ఫామ్లేక సతమతమయిన పుజారా టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. తన సహచరులంతా ఐపీఎల్లో బిజీగా ఉంటే పుజారా మాత్రం కౌంటీల్లో ఆడుతున్నాడు. బ్యాటింగ్లో ఇరగదీస్తున్న పుజారా సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్నాడు. ససెక్స్ తరపున బరిలోకి దిగిన పుజారా డర్హమ్తో మ్యాచ్లో సెంచరీ సాధించాడు. శుక్రవారం రెండోరోజు ఆట ముగిసేసమయానికి పుజారా 128 పరుగులు నాటౌట్గా నిలిచాడు.
కాగా ఈ సీజన్ కౌంటీలో పుజారాకు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం ససెక్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. దీంతో ససెక్స్ జట్టు డర్హమ్పై 139 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పుజారకు తోడుగా మహ్మద్ రిజ్వాన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా పుజారా ఇంతకముందు వరుసగా డెర్బిషైర్పై 201 పరుగులు, వర్సిస్టర్ షైర్పై 109 పరుగులు సాధించాడు.
ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్లో బిజీగా ఉన్నారు. ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో స్వదేశంలో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్కు వెళ్లనున్న భారత్.. ఆ పర్యటనలో ఒక టెస్టు, ఐదు టి20 మ్యాచ్లు ఆడనుంది. అంటే పుజరా టీమిండియా తరపున బరిలోకి దిగేది ఇంగ్లండ్తో జరగనున్న ఏకైక టెస్టు ద్వారానే అని తెలస్తుంది.
చదవండి: షాహిద్ అఫ్రిది ఒక క్యారెక్టర్ లెస్.. అబద్ధాల కోరు : పాక్ మాజీ స్పిన్నర్
ANOTHER 💯!@cheteshwar1 🤯 👏 pic.twitter.com/4nqhzhQjqW
— Sussex Cricket (@SussexCCC) April 29, 2022