ప్రిక్వార్టర్స్‌లో సింధు

Badminton Asia Championships 2022: Saina, Sindhu, Srikanth advance - Sakshi

సైనా, శ్రీకాంత్‌ కూడా

ఆసియా బ్యాడ్మింటన్‌

మనీలా: ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎ దురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్‌ ప్లే యర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ తీవ్రంగా శ్రమించి ముందంజ వేయగా, కిడాంబి శ్రీకాంత్‌ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. ‘డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌’ పీవీ సింధు తొలి రౌండ్‌లో 18–21, 27–25, 21–9 స్కోరుతో పై యు పొ (చైనీస్‌ తైపీ)పై విజయం సాధించింది. ఈ పోరు ఏకంగా 77 నిమిషాల పాటు సాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న పై యు పొ భారత టాప్‌ ప్లేయర్‌కు గట్టి పోటీనిస్తూ తొలి గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌ కూడా హోరాహోరీగా 52 పాయింట్ల పాటు సాగింది.

చివరకు తన అనుభవాన్నంతా ఉపయోగించి గేమ్‌ను గెలుచుకున్న సింధు, మూడో గేమ్‌లో చెలరేగి ప్రత్యర్థిపై విరుచుకుపడింది. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్‌ 21–15, 17–21, 21–13 తేడాతో సిమ్‌ యుజిన్‌ (దక్షిణ కొరియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 22–20, 21–15తో జె యంగ్‌ (మలేసియా)పై గెలుపొందాడు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత లక్ష్యసేన్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఐదో సీడ్‌ సేన్‌ 21–12, 10–21, 19–21 స్కోరుతో లి షి ఫెంగ్‌ (చైనా) చేతి లో పరాజయంపాలు కాగా...సాయిప్రణీత్‌ 17–21, 13–21తో నాలుగో సీడ్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. ఇతర భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్, సిమన్ర్‌ సింఘి–రితిక థాకర్‌ జోడి తొలి రౌండ్‌ దాటలేకపోయారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top