
బాకు (అజర్బైజాన్): ప్రపంచాన్ని ‘గుడ్డి’గా నమ్మించిన అజర్బైజాన్ పారా జూడో క్రీడాకారిణి పాపం పండింది. జీవితకాల నిషేధానికి గురైంది. ఒక శాతం కూడా దృష్టిలోపం లేకపోయినా... నకిలీ అంధత్వ సర్టిఫికెట్తో అంతర్జాతీయ పోటీల్లో అజర్బైజాన్ జూడో క్రీడాకారిణి షహానా హాజియెవా (Shahana Haji) పతకాలు గెలిచింది. ఇప్పుడు పాపం పండటంతో ‘పోడియం’కెక్కిన ఆమె పాతాళానికి పడిపోయింది.
అసలు విషయమేమిటంటే... 26 ఏళ్ల హాజియెవా టోక్యో పారాలింపిక్స్లో దృష్టి లోపం ఉన్న జూడో క్రీడాకారిణిల విభాగంలో (48 కేజీలు) పోటీపడి బంగారు పతకం గెలుపొందింది. కాలచక్రం తిరిగేసరికి ఈ లోపల మరో పారాలింపిక్స్ క్రీడలు (పారిస్) కూడా ముగిశాయి. ఇన్నాళ్లూ బాగానే ఉంది. కానీ ఈనెల కజకిస్తాన్లోని అస్తానాలో ప్రపంచ పారా జూడో చాంపియన్షిప్ జరిగింది. ఇందులో కళ్లున్నా... కనపడనట్లు ఆడిన కపట నాటకం బయటపడింది.
ఈవెంట్ సందర్భంగా నిర్వహించిన అంధత్వ పరీక్షలో విస్తుపోయే వాస్తవం వెలుగులోకి వచ్చింది. షహానా హాజియెవాకు రెండు కళ్లు వందశాతం కనిపిస్తూనే ఉన్నాయని తేలింది. ఎలాంటి దృష్టి లోపం, పాక్షిక అంధత్వం కూడా లేదని తేలింది. దీంతో ప్రపంచ పారాలింపిక్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై జీవితకాల నిషేధం విధించింది. ప్రపంచం ‘కన్ను’గప్పిన ఆమె మోసంతో ఇప్పుడు పారా క్రీడలు కాదుకదా అసలైన క్రీడల్లో కూడా పాల్గొనే అర్హతను పూర్తిగా కోల్పోయింది.
అజర్బైజాన్కే చెందిన ఎల్నారా నిజామ్లికి పాక్షిక దృష్టి లోపం ఉంది. కానీ ఆమె పూర్తి అంధత్వంతో ‘జే1’ కేటగిరీలో పాల్గొనాలని చూసిన మోసం కూడా బట్టబయలైంది. అయితే ఆమెకు ‘జే2’ కేటగిరీ (పాక్షిక అంధత్వం)లో పాల్గొనే అవకాశమిచ్చారు. అజర్బైజాన్ జాతీయ పారాలింపిక్ సంఘం తమ అథ్లెట్ల కపట నాటకంపై స్పందించింది. ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది.